Amaravati Green City: అమరావతిని( Amravati capital ) దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది చంద్రబాబు ప్రణాళిక. నవ నగరాలను నిర్మించి చరిత్రలో అమరావతికి ఒక ప్రత్యేక పేజీ ఉండాలని భావిస్తున్నారు ఏపీ సీఎం. ముఖ్యంగా పచ్చదనం మరింత పెంపొందించాలని చక్కటి ఆలోచనలు చేస్తున్నారు. అమరావతిలో 30% భూభాగంలో హరితవనాలు, పార్కులు ఉండేలా ప్రణాళికల రూపొందిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 ఎకరాల్లో పార్కుల అభివృద్ధికి, చెట్లు పెంచేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధాన రహదారులు, ఎల్పిఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన, రోడ్ల మధ్యలో, కాలువలు, చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున మొక్కలను పెంచనున్నారు.
* ఇండోర్ నగరాన్ని అధిగమించేందుకు..
ఇప్పటివరకు దేశంలో ఇండోర్ నగరం( Indore city) పచ్చదనంలో మొదటి స్థానంలో ఉంది. దానిని మైమరిపించేలా అమరావతిని తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రణాళిక. నవ నగరాలు కావడంతో.. వాహన రద్దీ, ఇతరత్రా కారణాలతో వాయు కాలుష్యం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరాధి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు కాలుష్యం బారిన పడ్డాయి. అందుకే ముందుచూపుతోనే చంద్రబాబు హరితవనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సింగపూర్ మోడల్ తరహాలో రాజధాని అమరావతిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అమరావతికి సేకరించిన భూముల్లో 30% భూభాగంలో పార్కులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
* అందుబాటులో నర్సరీలు..
ఇప్పటికే అమరావతి ప్రాంతంలో భారీ నర్సరీల( nurseries) సైతం ఏర్పాటు చేశారు. ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం కొండలపై మొక్కలు పెంచుతున్నారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. భారీ వృక్షాలను తొలగించారు. వాటిని శాస్త్రీయ పద్ధతిలో నర్సరీలో ఉంచారు. ఆ మహావృక్షాలను సైతం రహదారులకు ఇరువైపులా, పెద్ద పార్కుల్లో ఏర్పాటు చేయనున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్ పి ఎస్ లేఅవుట్లలో 1602 ఎకరాల్లో.. 497 పార్కులను కూడా అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు.
* 34 ప్రధాన రహదారుల వెంబడి..
అమరావతిలో మొత్తం 34 ప్రధాన రహదారులు ఉన్నాయి. వీటిలో చాలా రోడ్లు వెంబడి మొత్తం 8 వరుసలుగా చెట్లు పెంచబోతున్నారు. రెండు వైపులా సైకిల్ ట్రాక్ లు( cycle tracks ), నడక మార్గాలను సైతం అందుబాటులోకి ఉంచనున్నారు. వాటి మధ్యలో ప్రధాన రహదారికి అటు మూడు వరుసలు, ఇటు మూడు వరసలు, మధ్యలో రెండు మీడియంలో కలిపి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచుతారు. కాలువల వెంబడి సుందరీకరణ కోసం 611 ఎకరాలు కేటాయించారు. ఇలా అమరావతి నవ నగరాల్లో కాలుష్యం అనే మాట లేకుండా.. ప్రజలు స్వచ్ఛమైన వాయువును పీల్చే విధంగా బృహత్తర పథకాన్ని ఆవిష్కరించారు చంద్రబాబు. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ చూపుతారో చూడాలి.