Potti Sriramulu Statue Amaravati: అమరావతి రాజధానిలో( Amravati capital ) అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు అమరజీవి. అటువంటి మహోన్నతుడి 125 జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్ అనే పేరు పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను వదిలిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు అంటే అందరూ ఆహ్వానించాలి. కానీ కులాల పరిధిలో కుదించే ప్రయత్నాలు జరుగుతుండడం మాత్రం బాధాకరం. పొట్టి శ్రీరాములు ఒక కులం ప్రతినిధి కాదు. మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని గుర్తించుకోవాలి. అటువంటి వ్యక్తి భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం అంటే శుభపరిణామం.
* తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం..
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను వదులుకున్నారు పొట్టి శ్రీరాములు( potty Sri Ramulu) . ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు మడమతిప్పని పోరాటం చేసిన యోధుడు ఆయన. ఆయన చేసిన త్యాగం వల్లే ఈరోజు మనం ఆంధ్రులం అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అందుకే 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయన 125వ జయంతి నాడు ప్రతిష్టించాలని నిర్ణయించింది. కానీ ఆయన ఒక వర్గానికి.. ఒక్క కులానికి పరిమితం చేసే ధోరణి పెరుగుతోంది. ఇది ముమ్మాటికి చాలా తప్పిదం. పొట్టి శ్రీరాములు కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసమే పోరాటలేదు. ఆయన గొప్ప మానవతావాది అని ఆయన ట్రాక్ రికార్డు చెబుతుంది.
* స్వాతంత్ర ఉద్యమంలో..
స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు పొట్టి శ్రీరాములు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి.. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. నెల్లూరు జిల్లాలో అయితే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ ఆయన చాలా ఉపవాస దీక్షలు కూడా చేశారు. అప్పట్లో దేశవ్యాప్త చర్చ కూడా దానిపైన సాగింది. కులాలకు అతీతమైన సమాజం కోసం ఆయన పరితపించారు. కానీ ఈరోజు ఆయన పుట్టిన కులం వారు మాత్రమే ఆయనను గౌరవించాలి అనే సంకుచిత భావజాలం బయటపడడం సిగ్గుచేటు.
* ఆ భావన తప్పు..
పొట్టి శ్రీరాములు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నడూ తన స్వార్థం కోసం ఆలోచించలేదు. భార్య బిడ్డలను కోల్పోయినా.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసినా.. అది కేవలం దేశం కోసం మాత్రమే అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అటువంటి వ్యక్తిని ఒక కుల సంఘం విగ్రహం గాను.. ఒక వర్గం ఆస్తి గాను భావించకూడదు. అలా చేస్తే మహనీయులను అగౌరవపరిచినట్టే. అయితే ఇదే కులం కోణం బాధితుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయనే బాధితుడు అయినప్పుడు పొట్టి శ్రీరాములు ఒక లెక్క అనేది తప్పు. మహనీయులు, వారి ఆశయాలను భావితరాలు గుర్తించుకోవాలంటే ఇటువంటి గొప్ప పనులు, గొప్ప చిహ్నాలు సజీవంగా ఉంచుకోవాలి. అప్పుడే భావితరాలకు సరైన మార్గదర్శకం చేయవచ్చు.