Amanchi Krishna Mohan: ఆమంచి కృష్ణమోహన్ తెలుగు నాట ఈ పేరు సుపరిచితం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర ఆయనది. చీరాల నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేత. కానీ జగన్ చీరాలలో ఆయనకు అవకాశం లేకుండా చేశారు. పర్చురు బాధ్యతలు అప్పగించారు. అయిష్టంగానే అక్కడ బాధ్యతలు తీసుకున్న ఆమంచి కృష్ణమోహన్ చీరాల లో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది తెలిసి జగన్ ఆయన్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడా టిక్కెట్ లేకుండా చేశారు. దీంతో వైసీపీ నుంచి బయటకు రావాల్సిన అనివార్య పరిస్థితి ఆమంచి కృష్ణమోహన్ కి ఎదురైంది. ఈనెల 9న ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.
దివంగత సీఎం రోశయ్య ప్రోత్సాహంతో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో వైసిపి హై కమాండ్ టికెట్ కేటాయించకపోవడంతో ఇండిపెండెంట్ గా చీరాల నియోజకవర్గంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. చంద్రబాబు సైతం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఒక మండలానికి ఇన్చార్జిగా నియమించారు.అక్కడ మంచి ఫలితం రావడంతో చంద్రబాబు వద్ద ఆమంచి కృష్ణమోహన్ కు పరపతి పెరిగింది.అందుకే గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా కృష్ణమోహన్ పేరును చంద్రబాబు ప్రకటించారు.కానీ వైసీపీలోకి వెళ్లాలని ఉద్దేశంతో చంద్రబాబుపై విమర్శలు చేసి మరి పార్టీని వీడారు.
అయితే చీరాలలో టిడిపి తరఫున గెలిచిన కరణం బలరామును జగన్ తన పార్టీలోకి రప్పించారు. అప్పటికే చీరాల వైసిపి ఇన్చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ప్రాధాన్యతను తగ్గించారు. అసలు గెలుపు అవకాశం లేని పర్చురు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణ ప్రసాద్ కు పంపించారు. కానీ చీరాలలో తనకున్న పట్టు కృష్ణ ప్రసాద్ కు తెలుసు. అందుకే చివరివరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ మాత్రం కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైపు మొగ్గు చూపారు. ఆయన పేరు ప్రకటించారు.అదే సమయంలో పర్చురు నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఖరారు చేశారు. కేవలం చీరాల నుంచి ఆమంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని జగన్ కు సమాచారం ఉంది. అందుకే ఇలా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు టిడిపి, జనసేన, బిజెపిలో ఆమంచి కృష్ణమోహన్ కు అవకాశం లేకుండా పోయింది. తనను ఇంతలా మోసం చేసిన వైసీపీకి దారుణంగా దెబ్బతీయాలని కృష్ణ మోహన్ భావిస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ఈ నెల 9న తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.