Free gas cylinder Scheme : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీపం పథకం పై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఉచిత పథకానికి అర్హులు. ఈనెల 29 ఉదయం 10 గంటల నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎంఎస్ వెళుతుందని చెప్పారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందని.. సిలిండర్ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు లబ్ధిదారుల అకౌంట్లోకి జమ అవుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు 894 కోట్ల రూపాయలు ఈ పథకానికి గాను అందిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29న ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు చెక్కులు అందిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబం అక్టోబర్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోగా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని అమలు అమలు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో మహిళల్లో ఒక రకమైన సందడి ప్రారంభం అయ్యింది.
* పేదలకు ప్రయోజనమే
కుటుంబ జీవనం కష్టతరంగా మారింది. ముఖ్యంగా నిత్యవసర ధరలు పెరిగాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గ్యాస్ ఉచితంగా అందిస్తుండడం శుభపరిణామం. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 830 రూపాయలు గా ఉంది. ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు అంటే.. 2500 రూపాయల లబ్ధి ఒక్కో కుటుంబానికి చేకూరనుంది. ఈ పథకం అమలుకు దాదాపు 3 వేల కోట్ల రూపాయలు ఏడాదికి అవుతుందని తెలుస్తోంది. అంటే ఈ ఐదేళ్లలో ఉచిత గ్యాస్ పథకానికి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ప్రభుత్వం.
* వారంతా అర్హులే
రాష్ట్రంలో ప్రస్తుతం 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన అందరూ ఉచిత పథకానికి అర్హులే. అవసరమైన వారు సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమస్య చెప్పుకోవచ్చు. అయితే సిలిండర్ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే.. వాటిని 48 గంటల్లో డబ్బులు తిరిగి వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు నెలలకు ఓ సిలిండర్ చొప్పున ఉచితంగా అందిస్తారు. 2025 ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు మొదటి సిలిండర్… ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ నెల ఆఖరి వరకు రెండో సిలిండర్.. డిసెంబర్ ఒకటి నుంచి 2026 మార్చి నెలాఖరు వరకు మూడో సిలిండర్ అందిస్తారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృత నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.