ABN Radhakrishna Comments Controversy: ప్రజాస్వామ్యంలో మీడియా సంస్థల అధినేతలకు ప్రత్యేక హక్కులు అంటూ ఉండదు. అలాగే రాజకీయ పార్టీలకు సర్వ అధికారాలు దఖలు పడవు. మీడియా అధినేతలకు ప్రత్యేకంగా రాజ్యాంగం అంటూ ఉండదు. రాజకీయ పార్టీలకు కూడా ఇష్టానుసారంగా చేసుకునే హక్కు ఉండదు.. మీడియా అధినేతలు సాధారణంగా వ్యవస్థలో తప్పులు చోటు చేసుకున్నప్పుడు ప్రశ్నించాలి. ఆ ప్రశ్న కూడా సహేతుకంగా ఉండాలి. అలాకాకుండా ఎదురుదాడి చేసినట్టు.. ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్టు ఉండకూడదు.
మన సమాజంలో ఒక వ్యక్తులు.. వ్యవస్థలు ప్రశ్నించడానికి అసలు తట్టుకోలేవు. ఎందుకంటే ప్రశ్నలో తిరుగుబాటు ఉంటుంది. దానికి సమాధానం చెప్పలేనప్పుడు ఎదురుదాడి అనేది అంతిమంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాలలో మీడియా అధినేతలు వర్సస్ రాజకీయ పార్టీ నేతలు అనేది ఎప్పటినుంచో సాగుతూనే ఉంది. మీడియా అధినేతలకు రాజకీయ రంగులు ఉండడంతో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల నేతలు కూడా వారి వద్ద అర్ద బలం.. అంగ బలం ఉండడంతో తమ సత్తా చూపిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో మీడియా అనేది చులకన అవుతుంది. రాజకీయ పార్టీల నేతలు రౌడీల మాదిరిగా కనిపిస్తున్నారు.
ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు వ్యాసంలో మావిగన్ మారీచ శీర్షికతో సంచలన విషయాలను వెల్లడించారు. సహజంగానే జగన్ అంటే రాధాకృష్ణకు విపరీతమైన కోపం. తన కొత్త పలుకు వ్యాసంలో సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కూడా రాధాకృష్ణను ఇష్టానుసారంగా తిడుతూనే ఉంటుంది. ఇదంతా కూడా గట్ల పంచాయతీ మాదిరిగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే మావిగన్ మీద జగన్ చేసిన వ్యాఖ్యలను రాధాకృష్ణ విమర్శిస్తే బాగుండేది. కానీ ఇందులో ఆయన ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది. వివాహాలు చేసుకున్న తర్వాత.. జగన్ చెబితే వారిని చెల్లెలుగా భావించి.. మళ్లీ పెళ్లి చేస్తారని రాధాకృష్ణ అనడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వాస్తవానికి రాధాకృష్ణ నుంచి ఇటువంటి వ్యాఖ్యలను ఎవరూ ఊహించరు. ఆయన మామూలు జర్నలిస్టు కాదు. చాలా సంవత్సరాల అనుభవం ఉంది. పైగా మూతపడిన పత్రికను నిలబెట్టారు. అనుబంధంగా ఛానల్ ఏర్పాటు చేశారు. డిజిటల్ మీడియా వ్యవస్థలను కూడా నిర్మించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
అటువంటి రాధాకృష్ణ జగన్ వ్యాఖ్యల మీద ఆస్థాయిలో విమర్శలు చేయడం సబబు కాదు. అయితే ఇటువంటి విమర్శలు చేసినప్పుడు న్యాయపరంగా వెళ్తే రాధాకృష్ణను ప్రజల్లో దోషిగా నిలబెట్టవచ్చు. కానీ వైసీపీ ఆ పని చేయలేదు. పైగా ఆదివారం పబ్లిష్ అయిన ఈ కథనానికి మంగళవారం రెస్పాండ్ అయింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో మంగళవారం ఏబీఎన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. ఆంధ్రజ్యోతి కార్యాలయంలోకి దూసుకుపోవడానికి ప్రయత్నించింది. పోలీసులు వైసీపీ కార్యకర్తలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ తోపులాట చేసుకుంది.
ఈ ఘటన జరిగిన తర్వాత ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికావని స్పష్టం చేశారు. మరోవైపు న్యూట్రల్ గా ఉండే జర్నలిస్టులు ఈ పరిణామాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాధాకృష్ణ అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని.. వైసిపి దాడులకు దిగుకూడదని చెబుతున్నారు. జగన్ విధానంలో తప్పుంటే విమర్శించాలని.. అలా కాకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం తప్పని చెబుతున్నారు.