Homeఆంధ్రప్రదేశ్‌Eluru: దాని కోసం ఇంట్లోకి ప్రవేశించి అఘాయిత్యం.. ఏపీలో ఓ వాలంటీర్ దురాగతం

Eluru: దాని కోసం ఇంట్లోకి ప్రవేశించి అఘాయిత్యం.. ఏపీలో ఓ వాలంటీర్ దురాగతం

Eluru: ఏపీలో వాలంటీర్ల ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ కావాలని కోరుతూ ఓ ఇంట్లో ప్రవేశించిన వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. పలుమార్లు బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. నిలదీసిన తల్లిదండ్రులకు వాలంటీర్ పదివేలు ఇస్తాను.. మీ కూతురు కడుపు తీయించుకోండి అంటూ కర్కశంగా మాట్లాడాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. సదరు వాలంటీర్ స్థానిక వైసీపీ నేత అనుచరుడు కావడమే కారణమని తెలుస్తోంది.

ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో నీలాపు శివకుమార్ అనే యువకుడు వలంటీర్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. రెండు నెలల కిందట ఆధార్ కార్డులు కావాలని వారి ఇంటికి వెళ్ళాడు. బాలిక ఒంటరిగా ఉండడాన్ని చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. పాఠశాలకు సెలవులు రావడంతో బాలిక తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె వైద్య పరీక్షలు చేయించుగా బాలిక గర్భవతి అని తేలింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు వాలంటీర్ను నిలదీశారు. రూ.10 వేలు ఇస్తాను కడుపు తీయించుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

అయితే దీనిపై గ్రామంలో పంచాయతీ నడిచింది. పెద్దల సమక్షంలో బాలికను వివాహం చేసుకునేందుకు వాలంటీర్ ఒప్పుకున్నాడు. తీరా పెళ్లి ఏర్పాట్లు చేశాక పరారయ్యాడు. అప్పటినుంచి బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ముందుగా ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ అధికారులు లేరంటూ ఫిర్యాదు తీసుకోలేదు. దెందులూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా కేసు నమోదుకు తాత్సారం చేశారు. చాలాకాలం పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు జగనన్నకు చెబుదాం, స్పందన, 112 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. చివరకు అక్టోబర్ ఐదు న పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు అసలు ముందుకు సాగలేదు. స్థానిక వైసీపీ నాయకుడు ఒత్తిడితోనే పోలీసులు దర్యాప్తు చేయడం లేదని బాధిత బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో కాలయాపన పై పోలీసులను బాలిక బంధువులు అడగగా.. మీరే నిందితుడిని వెతికి పట్టుకొస్తే తాము చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని వాపోతున్నారు. వాలంటీరు ఇళ్లల్లోకి ప్రవేశించి ఆడపిల్లలను ఇబ్బంది పెడితే బాధ్యత ఎవరిదని కొద్దిరోజుల కిందట పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై దుమారమే నడిచింది. ఇప్పుడు పవన్ అనుమానాలే నిజమవుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version