Kamma Community : నీరు పల్లాన్ని వెతుక్కుంటూ ప్రవహిస్తుంది.అలాగే కమ్మవారు భూమిని వెతుక్కుంటూ వెళుతుంటారని ఒక టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగా నదీ పరీవాహక ప్రదేశాలు, అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో కమ్మ సామాజికవర్గం ప్రజలు అగ్రస్థానంలో తారసపడుతుంటారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలుంటే అక్కడ కచ్చితంగా కమ్మవారు ఉంటారని ఒక కామెంట్ ఉంది. అందులో కొంత వాస్తవం ఉంది. ఒడిశాలాంటి మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్మలు భారీ కమతాలను సాగుచేస్తుంటారు. అంతవరకెందుకు శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో సైతం వ్యవసాయాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపించే కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే.
సుదీర్ఘ చరిత్ర..
కమ్మ సామాజికవర్గానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గుండ్లకమ్మ, పేరికమ్మ (కృష్ణానది) నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి వలసవచ్చారనీ మరో కథనం చెబుతోంది. అయితే ఏ మూలాలు చేసినా వారికి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అనుబంధం తెలియజేస్తోంది. వ్యవసాయమే ప్రధాన వృత్తి అని తేలిపోయింది.
అడ్మినిష్ట్రేషన్ లో..
కమ్మవారికి పాలనా అనుభవం ఎక్కువ. శతాబ్దాల కిందటే వారు రాజుల వద్ద వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. పాలన, రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు. అయితే రాజ వంశాలు కనుమరుగైన తరువాత మాత్రం వ్యవసాయ రంగంపై దృష్టిసారించారు. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూమిని రాజుల నుంచి పొందగలిగారు. సరిగ్గా అదే సమయంలో దేశంలో హరిత విప్లవం ఎంట్రీ ఇవ్వడం వీరికి కలిసొచ్చింది. ఒక్కమన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సైతం వ్యవసాయం చేసేవారు. కృష్ణా గుంటూరులో ఉండే భూములను విక్రయించి.. అదే సొమ్ముతో రెట్టింపు భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేసినవారూ ఉన్నారు.
అన్నింటా సక్సెస్..
20వ శతాబ్ది మలిభాగంలో వ్యవసాయంతో పాటు వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి విజయం సాధించారు. సినిమా, టూరిజం, వైద్యం, విద్య, పత్రికలు, మీడియా – వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి సక్సెస్ అయ్యారు. సామాజికవర్గ విస్తరణకు కారణమయ్యారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, మరోవైపు ఒడిశాలో సైతం తమ ముద్రను చాటుకున్నారు. భారీ కమతాలతో పాటు విభిన్న, వాణిజ్య పంటలను సైతం సాగుచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు.అందుకే కమ్మ సామాజికవర్గం వారిని ఉద్దేశించి ‘నీరు పల్లమెరుగు.. కమ్మవర్గం భూమినెరుగు’ అన్న వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.