Andhra Woman US Citizenship: బీటెక్ పూర్తయిందా.. ఏదో ఒక యూనివర్సిటీలో సీటు వచ్చిందా.. బ్యాంకు లోన్ తీసుకున్నామా.. ఫ్లైట్ ఎక్కడమే.. అక్కడే ఏదో ఒక యూనివర్సిటీలో చేరడం.. కాలేజీలో పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం.. ఆ తర్వాత ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవడం.. అనంతరం డాలర్ల వేట కొనసాగించడం.. స్థిరపడిన తర్వాత అక్కడే ఇల్లు కొనుక్కోవడం.. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా సిటిజెన్ గా మారిపోవడం.. చాలామంది భారతీయులు చేస్తున్న పని ఇదే.
సంపాదన పిచ్చి.. హై ప్రొఫైల్ గా బతకాలని ఆశ.. స్టేటస్ మెయింటైన్ చేయాలని కోరిక.. ఇవన్నీ కూడా చాలామందిని అమెరికా దారి పట్టిస్తున్నాయి. ఫలితంగా వారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ.. దానికోసం ఇండియన్ సిటిజెన్షిప్ కూడా వదులుకుంటున్నారు. అంతేకాదు అక్కడే ఆస్తులు, అంతస్తులు సమకూర్చుకుంటున్నారు. అమెరికా వెళ్ళినవారు మళ్లీ ఇండియాకు తిరిగి రావాలి అనుకోవడం లేదు. అక్కడి సంపాదన వారిని ఇక్కడికి రానివ్వడం లేదు. అందువల్లే అమెరికాలో స్థిరపడుతున్న భారతీయులు ఏటికేడు పెరిగిపోతున్నారు. అయితే అటువంటి వారికి ఈ 94 సంవత్సరాల వృద్ధురాలు గొప్ప గుణపాఠం చెబుతున్నారు. దేశం కోసం సప్తసముద్రాలు దాటిన ఆమె.. ఇప్పుడు మాతృభూమి మీద ప్రేమను ప్రదర్శిస్తున్నారు.
అది గుంటూరు జిల్లా బాపట్ల. ఆమె పేరు మహా లక్ష్మమ్మ.. ఈమె గతంలోని అమెరికా వెళ్ళింది. ఈమె కుటుంబ సభ్యులు కూడా అక్కడి పౌరసత్వాన్ని పొందారు. మహాలక్ష్మమ్మకు 94 సంవత్సరాల వయసు.. ఇటీవల ఆమె బాపట్ల వచ్చారు. ఇంతటి వృద్ధాప్యంలో ఆమె అమెరికా పౌరసత్వాన్ని వద్దనుకుంటున్నారు. భారత పౌరసత్వాన్ని కోరుకుంటున్నారు. తన చివరి శ్వాస కూడా ఇక్కడే విడవాలని కోరుకుంటున్నారు.. తన అంత్యక్రియలు సొంత గ్రామాలను జరగాలని.. వీలైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని బాపట్ల కలెక్టర్ ను మహాలక్ష్మమ్మ కోరారు.
మహా లక్ష్మమ్మ 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఆమె కుటుంబ సభ్యులు అమెరికాలోనే ఉన్నారు. అయితే ఆమెకు బాపట్లలో ఇల్లు.. ఇతర ఆస్తులు ఉన్నాయి. దీనికి తోడు ఆమెకు మాతృభూమి అంటే విపరీతమైన మమకారం. అందువల్లే చివరి దశలో స్వదేశానికి వచ్చింది. ఇక్కడే కన్ను మూయాలని బలంగా కోరుకుంటున్నది. కానీ నేటి కాలంలో చాలామంది మన దేశ పౌరసత్వాన్ని సులువుగా వదులుకుంటున్నారు. అమెరికా లేదా ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు. మాతృభూమి మీద మమకారాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. కేవలం డాలర్ల సంపాదనలో పడి.. డబ్బు మాత్రమే లోకమని బతికేస్తున్నారు. అటువంటి వారు మహాలక్ష్మమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలి.
