Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: 8 మంది వారసుల్లో గట్టిక్కేది ఎవరు?

AP Elections 2024: 8 మంది వారసుల్లో గట్టిక్కేది ఎవరు?

AP Elections 2024: ఏపీలో 8 మంది వారసులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఎంతమంది గట్టెక్కుతారో చూడాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా నందమూరి తారక రామారావు, నాదెండ్ల భాస్కరరావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే ఇందులో ఎనిమిది మంది ముఖ్యమంత్రుల వారసులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బరిలో దిగారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.

వైయస్ జగన్ 2009లో కడప ఎంపీగా తొలిసారిగా విజయం సాధించారు. తండ్రి అకాల మరణంతో 2010లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీ అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి మూడోసారి పోటీ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. 1985 నుంచి 1994 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించారు. 1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఎన్టీఆర్ కుమార్తెదగ్గుబాటి పురందేశ్వరి 2004లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో విశాఖ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని వీడారు. బిజెపిలో చేరి 2014లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయినా ఓటమి తప్పలేదు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో రాజమండ్రి నుంచి బరిలో దిగారు.

మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఎమ్మెల్సీ అయిన లోకేష్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2019లో తొలిసారిగా మంగళగిరి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఈసారి కూడా అక్కడి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో నెలరోజుల పాటు ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మాత్రం ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఈసారి తెనాలి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.

మరో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి మరోసారి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. ఈసారి డోన్ అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు.

మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి రాజకీయ అరంగెట్రం చేశారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అన్నతో విభేదించి తెలంగాణలో వైయస్సార్ పేరిట పార్టీని స్థాపించారు. ఆశించిన స్థాయిలో అక్కడ రాణించ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షురాలిగా పగ్గాలు అందుకున్నారు. కడప నుంచి బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఎనిమిది మంది వారసుల్లో ఎంతమంది విజేతలుగా నిలుస్తారో? ఎంతమందికి అదృష్టం కలిసి వస్తుందో? చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular