TDP Janasena Alliance: ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు ఐదు జాబితాలను ప్రకటించారు. 62 అసెంబ్లీ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా కొంతమంది మార్పు తప్పదని సంకేతాలు పంపిస్తున్నారు. అటు తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రారంభమైందన్న వార్తలు వస్తున్నాయి. వీలైనంతవరకు అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్ సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబుతో పాటు పవన్ ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
13 ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థులను డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇందులో 11 స్థానాల్లో టిడిపి, రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం తో పాటు కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట స్థానాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి జనసేన తరఫున టికెట్ కేటాయించనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి బరిలో దిగనున్నారు. వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఈసారి టిడిపి టికెట్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
టిడిపి అభ్యర్థులకు సంబంధించి.. శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం భరత్, అనకాపల్లి దిలీప్ చక్రవర్తి, నరసాపురం రఘురామకృష్ణంరాజు, ఏలూరు గోపాల్, విజయవాడ కేశినేని చిన్ని, నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు, తిరుపతి నిహారిక, రాజంపేట బాలసుబ్రమణ్యం, హిందూపురం పార్థసారథి, అనంతపురం కాల్వ శ్రీనివాసుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సానా సతీష్, మచిలీపట్నం నుంచి బాలశౌరిలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా 14 పార్లమెంట్ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. బిజెపి కూటమిలోకి వస్తుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ బిజెపి వస్తే కీలక పార్లమెంటు స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల నాలుగు వరకు చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తేవాలని ఇరువురు నాయకులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.