India China Border land Ports: మనం ఎంతగా మన సైన్యాన్ని అభివృద్ధి చేసినప్పటికీ.. ప్రపంచ దేశాలతో ఎంత గొప్పగా విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటున్నప్పటికీ.. మన పక్కనే ఉన్న చైనా తో.. అది సపోర్ట్ చేసే పాకిస్తాన్ తో ఎప్పటికీ ఇబ్బందులే. పైగా సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు నిత్యం కలహాలకు.. కవ్వింపులకు దిగుతూనే ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను కాపాడుకోవడానికి భారత్ విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు పర్యావరణ అననుకూల పరిస్థితుల వల్ల చాలామంది సైనికులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలకు చెక్ పెట్టేందుకు మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
దేశంలో 74 ల్యాండ్ పోర్ట్ లు
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట సరికొత్తగా ల్యాండ్ పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చైనా సరిహద్దు వెంట మూడు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట ఆరింటిని నిర్మించే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా పొరుగు దేశాలలో వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి.. భద్రతను బలోపేతం చేసుకోవడానికి భారత్ ల్యాండ్ పోర్టులను నిర్మించమంది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట మొత్తంగా 74 భూ ఓడరేవులు (ల్యాండ్ పోర్ట్) నిర్మించబోతోంది.
వీటివల్ల ఏం ఉపయోగమంటే..
సముద్రంలేని ప్రాంతాలలో.. రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించే ప్రక్రియను ల్యాండ్ పోర్టులు అని పిలుస్తుంటారు వీటి ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాణిజ్యాన్ని సాగించవచ్చు. అంతర్జాతీయంగా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ల్యాండ్ పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు నిర్వహించవచ్చు. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని నామ్ గియా, ఉత్తరాఖండ్లోని గుంజి, సిక్కిం లోని నాదూల ప్రాంతాలలో భూమార్గ ఓడరేవులు నిర్మించబోతున్నారు.
పాకిస్థాన్ సరిహద్దులో..
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జమ్ము కాశ్మీర్ లోని టిట్ వాల్, అదోసా, చెక్కన్ దబాంగ్, పంజాబ్ లోని అట్టారి రైల్వే స్టేషన్, హుస్సేనివాల, రాజస్థాన్లోని మునబావు రైల్వేస్టేషన్లో భూమార్గ ఓడరేవులను నిర్మించబోతున్నారు. మనదేశంలో ప్రస్తుతం 15 ల్యాండ్ పోర్ట్లు ఉన్నాయి. మిగతా 11 వివిధ దశలలో ఉన్నాయి. అంతర్జాతీయంగా యుద్ధాలు.. ఇతర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇవి వాణిజ్యానికి అనుకూలంగా ఉంటాయి.. అందువల్లే భారత్ వీటి విషయంలో దూకుడుగా ఉంది. చైనా సరిహద్దు వెంట మూడు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట ఆరు భూమార్గ ఓడరేవులను నిర్మిస్తోందంటే భారత్ ఎంత ముందుచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు.

