UAE secret operation on Iran: మధ్య ఆసియా ప్రాంతంలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు అమెరికా,ఇరాన్ మధ్య శాంతి చర్చలు అంటూ వార్తలు వస్తున్నా.. ఇరాన్ పై కొన్ని దేశాలు ప్రతికారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు కొనసాగించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్… అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడింది. అయితే దీనికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కూడా ఇరాన్ చమురు క్షేత్రాలపై రహస్య దాడులు చేసిందని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా పత్రికల్లో ఒకటైన ‘వాల్ స్ట్రీట్ జర్నల్’సంచలన కథనాన్ని వెల్లడించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ దేశానికి చెందిన కీలక ఆయిల్ రిఫైనరీపై UAE పలుమార్లు దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్ లోని ఈ రిఫైనరీ రోజుకు సుమారు 60,000 బ్యారెల్స్ ముడి చమురును శుద్ధి చేస్తుంది. ఇది ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో చాలా ముఖ్యమైనది. దాడి ఫలితంగా రిఫైనరీ వద్ద భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఫలితంగా చమురు శుద్ధి కేంద్రం కొన్ని నెలల పాటు పనిచేయలేని స్థితికి చేరినట్లు సమాచారం. ఈ దాడి ఏప్రిల్ రెండో వారంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఇరాన్ దేశం తన కీలకమైన రిఫైనరీ దెబ్బతిందని గత నెలలోనే అంగీకరించింది. కానీ ఈ దాడిని ఎవరు చేశారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఈ దాడులకు పాల్పడింది UAE అని అమెరికా చెబుతోంది. ఈ దాడి తరువాత ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి.
ఇదిలా ఉండగా లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో UAE,కువైట్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు UAE, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.
గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ సాగుతోంది. దీంతో పైకి యుద్ధ పోరు కనిపించకపోయినా.. తీవ్రత మాత్రం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ వైపు ఇరాన్ తో చర్చలంటూనే అమెరికా తెరవెనుక గల్ఫ్ దేశాల దాడులకు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఈ పరస్పర దాడులు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.