Jagan- MLAs: రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి మేకపోతు గాంభీర్యంలా మారింది. పైకి మాత్రం 175 నియోజకవర్గాలకు 175 కొట్టేస్తున్నాం అంటూ ప్రగల్బాలు కనిపిస్తున్నాయి. లోలోపల మాత్రం డేంజర్ బెల్ మోగుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. 175 మాట దేవుడెరుగు.. ఇప్పుడున్న 151లో సగం నియోజకవర్గాలు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. వైసీపీలో కీలక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం డేంజర్ జోన్ లో ఉండడంతో హైకమాండ్ కలవరపాటుకు గురవుతోంది. సీఎం జగన్ సైతం పదే పదే హెచ్చరికలు జారీచేస్తున్నారు అందులో భాగమే. శ్రేణుల్లో స్థైర్యం నింపేందుకే 175 మాట తరచూ వస్తోందని.. కానీ క్షేత్రస్థాయిలో సీన్ మరోలా ఉందని నిన్న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల వర్క్ షాపులో తేలిపోయింది. గత డిసెంబరు 16న జరిగిన వర్క్ షాపు నాటికి 28 మంది ఎమ్మెల్యేలు వెనుకబాటు జాబితాలో ఉండేవారు. ఇప్పుడు తాజాగా జరిగిన వర్క్ షాపులో సైతం ఇంచుమించుగా అదే సంఖ్య కనిపిస్తుండడంతో జగన్ కంగారుపడిపోతున్నారు. ఆ జాబితాలో కీలక నేతలు ఉండేసరికి కక్కలేక మింగలేకపోతున్నారు.
Also Read: Bandla Ganesh- KCR: కేసీఆర్పై సడెన్గా బండ్ల గణేశ్కు జ్ఞానోదయం ఎలా అయ్యింది!
గత 50 రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులపై నిఘా పెట్టిన ఐప్యాక్ బృందం ఒక సర్వే నివేదికను తయారుచేసింది. గడపగడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ప్రజల మధ్య ఎవరెవరు ఎంతసేపు ఉన్నది మదింపు చేసి సర్వే రిపోర్టును తయారుచేశారు. వర్క్ షాపులో టీమ్ కు సారధ్యం వహిస్తున్న రుషిరాజ్ వెనుకబడిన ఎమ్మెల్యేల పేర్లను చదివి వినిపించారు. దీంతో విన్నవారికి మైండ్ బ్లాక్ అయ్యింది. అటు పార్టీ అధినేత కూడా కాస్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారండి.. లేకుంటే మార్చేస్తానంటూ సుతిమెత్తని హెచ్చరికలు జారీచేశారు. కానీ కఠువును ప్రదర్శించలేదు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఎపిసోడ్ తో జగన్ అచీతూచీ వ్యవహరించాల్సి వచ్చింది. కానీ లోలోపల మాత్రం సీనియర్ల పనితీరును రగిలిపోతున్నారు. వారి విషయంలో ఉపేక్షిస్తే అందరూ మునిగిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కొడాలి నాని వంటి వారిని వ్యక్తిగతంగా పిలిచి ఇదే చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యుల పనితీరు బాగాలేదని రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్ తేల్చేసింది. వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, కొడాలి నాని, చెన్నకేశవరెడ్డి, బొత్స అప్పలనరసయ్య, చింతల రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, జొన్నలగడ్ల పద్మావతి, మద్దిశెట్టి వేణుగోపాల్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, అన్నా రాంబాబు, కాటసాని రామిరెడ్డి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, జి.శ్రీనివాసులనాయుడు ఉన్నారు. తాడికొండ నియోజకవర్గ ఇన్ చార్జి సురేష్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జి అడారి ఆనంద్, పర్చూరు ఇన్ చార్జి ఆమంచి కృష్ణమోహన్ లు వెనుకబడి ఉన్నట్టు ఐ ప్యాక్ బృందం తేల్చిచెప్పింది.
బాగా పనిచేసిన వారి జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో దూలం నాగేశ్వరరావు, వరుకూటి అశోక్ బాబు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. రెండు గంటల్లోపు తిరిగిన మంత్రుల జాబితాలో ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, విశ్వరూప్ ఉన్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్, బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ తదితరులు నిలిచినట్టు రుషిరాజ్ సింగ్ ప్రకటించారు. అయితే డిసెంబరు 16 న జరిగిన సమావేశంలోనే జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ క్రమంలో వైసీపీలో ఆనం, కోటంరెడ్డిల రూపంలో ధిక్కార స్వరాలు వినిపించాయి. అందుకే జగన్ కాస్తా మెత్తబడ్డారు. వచ్చే సమావేశం నాటికి పనితీరు మెరుగుపరుచుకోకుంటే నేరుగా తప్పిస్తానని స్పష్టమైన సంకేతాలు మాత్రం పంపారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో?
Also Read: Jagan Stickers: ఏపీలో స్టిక్కర్ రాజకీయాలు .. చెరిగిపోతే పచ్చబొట్లు వేస్తారేమో
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More