Oil price increase due to war impact: ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపాయి. ఆయా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల గ్లోబల్ సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి . యూరప్, ఆసియా దేశాలకు హార్ముజ్ జలసంధి కీలక మార్గంగా ఉండటం వల్ల అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఆయిల్ ధరలు పెరగడమే కాకుండా, పరోక్షంగా అనేక నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. ఇంతకీ ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయంటే?
ఇరాన్ ఆధీనంలో ఉన్న హర్మోజ్ జలసంధి విషయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిని ఇరాన్ దేశం మూసివేత లేదా రవాణా పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి నౌకలు ప్రయాణించాలంటే టోల్ చెల్లించి రావడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని దేశాలకు ఇంధన సరఫరా అయ్యే నౌకలపై టోలు ఫీజు వసూలు చేస్తుండడంతో ఆ దేశాలతో సంబంధం ఉన్న భారత్ పై ప్రభావం పడుతోంది. ఇంధణ కొరత కారణంగా ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో పామాయిల్ ఉత్పత్తి తగ్గినట్లు పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారులు కావడంతో అక్కడ ఉత్పత్తి తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
భారతదేశంలో వినియోగించే వంటనూనెల్లో సుమారు 40 శాతం పామాయిల్ వాటా ఉంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వల్ల విస్తృతంగా వినియోగంలో ఉంది. అయితే సరఫరా తగ్గడంతో పామాయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది. వంటనూనెల ధరలు పెరగడం వల్ల గృహ వ్యయాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.
ఇది కేవలం వంటనూనెలకే పరిమితం కాకుండా అనేక ఫుడ్ ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది. పామాయిల్ను అధికంగా ఉపయోగించే చిప్స్, బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం భారంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది.
అదే విధంగా పామాయిల్ ఆధారంగా తయారయ్యే సబ్బులు, కాస్మొటిక్స్ మరియు ఇతర పర్సనల్ కేర్ ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశముంది. దీంతో రోజువారీ అవసరాల ఖర్చు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
యుద్ధ ప్రభావం కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా, ఆహార, వినియోగ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు విస్తరిస్తోంది. సరఫరా గొలుసులు సవ్యంగా కొనసాగకపోతే ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ దిగుమతులు, నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.