US Pilot Rescue From Iran: యుద్ధ సమయాల్లో సైనికులు శత్రుదేశాలపై దాడులు చేస్తున్న క్రమంలో పొరపాటున పట్టుబడడం జరుగుతుంది. కొందరు శత్రుదేశాల వ్యూహాల్లో చిక్కుకుని పట్టుపడతారు. పట్టుపడితే ఇక వారికి నరకమే. తాజాగా ఇరాన్–అమెరికా యుద్ధంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయింది. దీంతో రెండో పైలట్ ఇరాన్ భూభాగంలో పడిపోయాడు. అతడిని అమెరికా దళాలు సాహసోపేతంగా రక్షించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శత్రు భూభాగంలోకి చొచ్చుకువెళ్లి ఓ అమెరికన్ యోధుడిని బయటకు తీసుకురావడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన గర్వంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా బలగాల ఆధీనంలో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: ఉప్పల్ లో తిరుగులేని రికార్డులు ఉన్నా.. 300 కొట్టాలంటే సన్ రైజర్స్ చేయాల్సింది ఇదే
ఏం జరిగిందంటే..
ఇరాన్ రక్షణ దళాలు (ఐఆర్జీసీ) జరిపిన దాడిలో ఎఫ్–15ఈ విమానం దెబ్బతింది. కూలిపోయింది. అందులోని ఇద్దరు సిబ్బంది పారాచూట్ల ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. మొదటి పైలట్ను తొలుతే రక్షించగా, రెండో వ్యక్తి కోసం తీవ్ర గాలింపు సాగింది. ఇరాన్ సైన్యం అతడి కోసం వేట సాగిస్తోంది. ఇలాంటి ప్రమాదకర పర్వత ప్రాంతంలో 24 గంటలూ అమెరికా ఉన్నతాధికారులు – కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ – అతడి లొకేషన్ను నిరంతరం పర్యవేక్షించారు. చివరకు డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లతో సాగిన ఆపరేషన్ విజయవంతమైంది.
అమెరికన్ను ఒంటరిగా వదిలిపెట్టం..
ఈ ఆపరేషన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన, విజయవంతమైన రక్షణ చర్యగా పేర్కొన్నారు. రక్షణ పనులకు ఆటంకం కలగకూడదనే విషయాన్ని తొలుత బహిర్గతం చేయలేదని తెలిపారు. ఇరాన్ గగనతలంపై అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం ఉందని ఇదే నిరూపించిందని పేర్కొన్నారు. ‘ఏ అమెరికన్ యోధుడినీ ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టం‘ అని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇరాన్ బహుమతి ప్రకటన..
మరోవైపు ఇరాన్ మాత్రం ఈ పైలట్ను సజీవంగా పట్టుకుంటే 66,100 డాలర్ల బహుమతి ప్రకటించింది. తమ భూభాగంలో దిగిన అమెరికా సైనికుడిని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. రెస్క్యూ సమయంలో అమెరికా బ్లాక్హాక్ హెలికాప్టర్లపై కాల్పులు కూడా జరిగాయి. అయినా అవి సురక్షితంగా బయటపడ్డాయి. ఇరాన్ సైన్యం ‘శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది‘ అని ధీటుగా బదులిచ్చింది.
సైనికుడి కోసం బారీ ఆపరేషన్..
ఇరాన్లో చిక్కుకున్న సైనికుడి కోసం అమెరికా శత్రు గగనతలంలో 24 గంటలూ పర్యవేక్షణ, కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ సాంకేతిక సామర్థ్యాన్ని చాటింది. యోధులకు ‘మిమ్మల్ని వదిలిపెట్టం‘ అనే నమ్మకం కల్పించి, సైనిక ధైర్యాన్ని పెంచింది. ట్రంప్ పాలనలో అమెరికా తన యోధుల కోసం ఏ స్థాయికైనా వెళ్తుందని ప్రపంచానికి సందేశం ఇచ్చింది. అయితే ఇరాన్ ఎఫ్–15ఈ లాంటి అత్యాధునిక విమానాన్ని కూల్చడం, అమెరికాకు షాక్ ఇచ్చింది.
ఇరాన్ పర్వతాల్లో సాగిన ఈ సాహసోపేత ఆపరేషన్ అమెరికా సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. యోధుడి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా సాగిన ఈ చర్య, అమెరికా సంకల్పాన్ని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.