Trump Warning Iran: పశ్చిమాసియా యుద్ధం మొదలై నెల దాటింది. ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు.. ఎవరూ ఓడలేదు. కానీ నెల రోజుల పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మొన్నటి వరకు చర్చలు అన్న ట్రంప్ ఇప్పుడు హెచ్చరికలతో ఇరాన్ను బెదిరిస్తున్నాడు. ‘ఇరాన్ను స్టోన్ ఏజ్కు తీసుకెళ్తాం, నాయకులనే కాదు, పాలనా విధానాన్నే వెనక్కి నెట్టేస్తాం‘ అని ఘాటుగా హెచ్చరించారు.. ఇరాన్ వద్ద న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని, ఇది ప్రపంచ భద్రతకు ముప్పు అని ఆరోపిస్తూ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు. కానీ నెల రోజులు దాటినా యుద్ధం ముగియడం లేదు, రెజీమ్ చేంజ్ జరగలేదు.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
దీటుగా స్పందిస్తున్న ఇరాన్..
ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ దీటుగా బదులిస్తోంది. ‘మీది వందల ఏళ్ల చరిత్ర, మాది వేల ఏళ్ల చరిత్ర. అనేక మంది మా దేశంపైకి దండయాత్రకు వచ్చారు, కానీ ఎవరూ విజయం సాధించలేదు‘ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేర్కొన్నారు.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) అమెరికాతో తీవ్రంగా పోరాడుతోంది. అమెరికా పదాతి దళాలను దించితే కాళ్లు నరికేస్తామని హెచ్చరిస్తోంది. ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికా బేస్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.
హార్ముజ్పై మాట మార్చిన ట్రంప్..
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను స్వాధీనం చేసుకుంటామని నిన్నటి వరకు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ, హార్ముజ్ను మూసివేసింది. దీంతో ప్రపంచ చమురు సరఫరా దెబ్బతింది. తాజాగా ట్రంప్ ‘హార్ముజ్తో మాకు సంబంధం లేదు, మీకు కావాలంటే అమెరికా నుంచి ఇంధనం కొనుగోలు చేయాలి‘ అని ట్రంప్ షాక్ఇచ్చాడు. అమెరికా యుద్ధం కారణంగానే హార్ముజ్ మూతపడిందని, ఇప్పుడు అమెరికా చమురు కొనాలని అనడం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది.
యుద్ధం సందిగ్ధం..
ప్రస్తుతం ట్రంప్ యుద్ధంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. ‘ఇరాన్తో యుద్ధం లోక కల్యాణం కోసమే‘ అని చెబుతున్నా, గెలుస్తామన్న ధీమా ఆయన ముఖంలో కనిపించడం లేదు.. అమెరికా ఇరాన్లోని కీలకమైన బీ1 బ్రిడ్జిని కూల్చింది. ఇరాన్ను ఓడించిన తర్వాతే వెనక్కి వస్తామని, పదాతి దళాలను రంగంలోకి దించబోతున్నట్లు వెల్లడించాడు. కానీ ఇరాన్ బలహీనపడినా గల్ఫ్ దేశాలను దెబ్బకొడుతోంది.
యుద్ధంపై అమెరికన్ల అసంతృప్తి..
ఈ యుద్ధం వల్ల అమెరికన్లు సంతృప్తిగా లేరు. ట్రంప్ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ‘మా నుంచి అమెరికన్లకు ఎలాంటి ముప్పు లేదు‘ అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ కోసమే అమెరికా యుద్ధం చేస్తోందని ఆరోపిస్తున్నారు. గల్ఫ్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. కువైట్లో అమెరికా ఎఫ్–15 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసింది.
ఇరుదేశాల ఉన్నతాధికారులు చర్చల కోసం ఒమన్లో భేటీ కానున్నారు. ట్రంప్ ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు వాయిదా వేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. కానీ చర్చలు విజయవంతమవుతాయా, యుద్ధం మరింత తీవ్రమవుతుందా అనేది వేచి చూడాలి.
