Makala Jail: అది జైలా.. భూతల నరకమా.. ఒంటిపూట భోజనం, మొండి గోడలపై నిద్ర.. ఎక్కడుందో తెలుసా?

నేరం చేసిన వారు జైలుకు వెళ్లారు. కోర్టుల ఆదేశాలతో శిక్ష అనుభవిస్తారు. అయితే నేరం చేసినంత మాత్రాన వారి హక్కులకు భంగం కలగకూడదని మన చట్టం చెబుతోంది. కానీ కొన్ని దేశాల్లో మానవహక్కులనే పట్టించుకోరు. ఇక ఖైదీల పరిస్థితి అయితే మరీ దుర్భరం.

Written By: Raj Shekar, Updated On : September 10, 2024 12:03 pm

Makala Jail

Follow us on

Makala Jail: అది ఓ ఆఫ్రికా దేశం.. ఆఫ్రికా దేశం అంటేనే మనకు కరువు, కాటకాలు, పేదరికం, దుర్భర జీవితం గుర్తొస్తాయి. ఆఫ్రికాలోని డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో పరిస్థితి కూడా అంతే. ఈ దేశంలోని మకాలా జైలు నుంచి తప్పించుకోవడానికి ఇటీవల కొందరు ఖైదీలు విఫలయత్నం చేశారు. ఆ జైలు నరకాన్ని తలపిస్తుందని అక్కడ శిక్ష అనుభవించినవారు చెప్పారు. కాంగోలో అతిపెద్ద జైలు అయిన మకాలా గురించి అక్కడి మాజీ ఖైదీ మీడియాకు వెల్లడించాడు. ‘మకాలా నిజంగానే నరకం’ అని తెలిపాడు. ఓ ప్రతిపక్ష నేత మరణంలో సైన్యం ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కథనం రాశారన్న అభియోగంపై అధికారులు బుజకేరాను మకాలా జైలుకు పంపారు. ఆయన అక్కడ ఆరునెలలు గడిపారు.‘మకాలా జైలు కాదు, కాన్సంట్రేషన్‌ క్యాంపులను తలపించే నిర్బంధ కేంద్రం అది. చనిపోయేలా చేయడానికే అక్కడికి పంపిస్తారు’ అని ఆయన వెల్లడించారు. ఈ జైలు కాంగో రాజధాని కిన్షాసాలో ఉంది. దీని సామర్థ్యం 1500 మంది ఖైదీలు. కానీ అంతకు పది రెట్ల సంఖ్యలో ఖైదీలను ఇందులో ఉంచినట్లు అంచనా. చిన్నపాటి నేరాలు చేసేవారి నుంచి రాజకీయ ఖైదీలు, హంతకుల వరకు అందరూ ఇందులో ఉన్నారు. కొద్దికాలం మకాలా జైలులో ఉన్న బుజకేరాను అక్కడి జీవితం దుర్భరంగా ఉంటుందని చెప్పారు.

129 మంది మృతి
మకాలాలో ఖైదీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై మానవ హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నాయి. పరిమితికి మించి ఖైదీలను ఉంచడం, నాణ్యతలేని ఆహారం, పరిశుభ్రమైన మంచినీరు లేకపోవడం వంటి సమస్యలపై మానవ హక్కుల సంఘాలు మాట్లాడుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మరోసారి అక్కడి పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. గత సోమవారం (సెప్టెంబర్‌ 2) తెల్లవారుజామున మకాలా నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారని.. ఈ క్రమంలో 129 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారని కాంగో మంత్రి జాక్వెమైన్‌ షబానీ తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించినవారిపై కాల్పులు జరపడంతో 24 మంది మరణించారని, ఇరుకైన ప్రదేశంలో తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మరికొందరు చనిపోయారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన నలుగురు ఖైదీలు న్యూయార్క్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ జైలులోని దుర్భర పరిస్థితులను వివరించారు. తాము తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి రోజున్నర ముందు నుంచి మంచినీటి సరఫరా లేదని, కరెంటు లేక ఫ్యాన్లు తిరగలేదని వారు చెప్పారు. ఆ ఉక్కపోత, వేడిని తట్టుకోలేక కొంతమంది ఖైదీలు తొలుత బయటకు వచ్చారని చెప్పారు. మకాలా జైలులో పరిస్థితులు అసాధారణంగా ఉంటాయని, నీటి పంపులు ఎప్పుడూ ఎండిపోయి ఉంటాయని, కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియదని, ఖైదీలు రోజుల తరబడి చీకట్లోనే ఉండాల్సి వస్తుందని బుజకేరా తెలిపారు.

జైలును సందర్శించిన హెచ్‌ఆర్సీ..
కాంగోకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘లా వోయిక్స్‌ డెస్‌ సాన్స్‌ వోయిక్స్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రోస్టిన్‌ మాన్‌కేటా అనేకసార్లు మకాలా జైలును సందర్శించారు. ఎవరినైనా ఆ జైలుకు పంపారంటే వారిని నరకానికి పంపినట్లేనని ఆయన చెప్పారు. కాలు చాపడానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉన్న గది స్నానాల గది గోడలపై నిద్ర
బుజకేరా మకాలాలో ఉన్న సమయంలో తీసిన వీడియోలు ఆ జైలులోని దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టాయి. కిక్కిరిసిపోయిన ప్రదేశంలో నేలపై అనేకమంది ఖైదీలు నిద్రపోతుండడం అందులో కనిపిస్తుంది. ‘అయితే మకాలా జైలులో వీఐపీల సెల్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ మంచం, కొద్దిగా విశాలమైన స్థలం దొరుకుతాయి. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే అవి దొరుకుతాయి’ అని బుజకేరా చెప్పారు. వీఐపీ సెల్‌లో ఉండటానికి తనను 3 వేల అమెరికన్‌ డాలర్లు (సుమారు 2 లక్షల 50వేల రూపాయలు) అడిగారని.. తాను 450 అమెరికన్‌ డాలర్లు (సుమారు 38 వేల రూపాయలు) ఇచ్చి ఆ సౌకర్యాలు పొందానని బుజకేరా చెప్పారు.

అన్ని జైళ్లు అంతే..
డీఆర్‌ కాంగోలో ఒక్క మకాలా జైలే కాదు, ఆ దేశంలోని అన్ని జైళ్లు ఇలాగే పరిమితికి మించి భారీ సంఖ్యలో ఖైదీలతో, నిధుల కొరతతో దుర్భర స్థితిలో ఉన్నాయి. ‘వరల్డ్‌ ప్రిజన్‌ బ్రీఫ్‌ ప్రాజెక్ట్‌’ ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో డీఆర్‌ కాంగో జైళ్లు ఆరో స్థానంలో ఉన్నాయి. ఇటీవల ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో డిప్యూటీ జస్టిస్‌ మినిష్టర్‌ సామ్యూల్‌ ఎంబెంబా మాట్లాడుతూ.. జైళ్లలో రద్దీ పెరిగిపోవడానికి మేజిస్ట్రేట్లు కారణమని నిందించారు. కేసుల్లో అనుమానితులను కూడా జైలుకు పంపుతున్నారు అని ఆయన అన్నారు. నిజానికి చాలామంది ఖైదీలు నేరారోపణ రుజువై శిక్ష అనుభవించడం లేదు. కేవలం విచారణ కోసం ఎదురుచూస్తూ జైల్లో గడుపుతున్నారని తెలిపారు.

ఒంటిపూట భోజనం..
డీఆర్‌ కాంగో జైళ్లలో ఆహారంపైనా విమర్శలు ఉన్నాయి. మకాలాలో ఖైదీలకు ఒక్కపూటే భోజనం పెడతారు. కూరలలో పోషకాహార విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆహారం తినలేక చాలామంది ఖైదీలు తమ బంధువులు తీసుకొచ్చే భోజనంపై ఆధారపడతారు. కానీ అందరికీ ఇలాంటి అవకాశం ఉండదు. మకాలా జైలులో 17మంది ఖైదీలు ఆకలితో చనిపోయారని 2017నాటి ఓ నివేదిక పేర్కొంది. ఇలాంటి కఠిన పరిస్థితులే ఖైదీలకు తప్పించుకోవాలనే ఆలోచన కలిగిస్తున్నాయి.