POK violence latest news: మన పొరుగున్న ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పాక్ ఆజాద్ జమ్మూ కశ్మీర్)లో కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనలు, పోలీసు–ప్రజల మధ్య ఘర్షణలు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఒక్క సమస్య నుంచి పుట్టుకొచ్చాయని స్పష్టమవుతోంది. అది 12 రిఫ్యూజీ సీట్ల వివాదం. పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 45 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 12 సీట్లు 1947 తర్వాత భారతదేశ నుంచి వలస వచ్చి పాకిస్తాన్లో(కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, పంజాబ్, సింధ్ తదితర ప్రాంతాల్లో) స్థిరపడిన కశ్మీరీ శరణార్థులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. ఈ 12 సీట్ల ఓటర్లు పీవోకేలో కాకుండా పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లోనే ఓటు వేస్తారు.
జేఏఏసీ ఆరోపణలు..
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలోని స్థానికులు ఈ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి ప్రకారం ఈ 12 సీట్ల ద్వారా పాకిస్తాన్ జాతీయ రాజకీయ పార్టీలు(ముఖ్యంగా పంజాబ్ ఆధారిత పార్టీలు) పీవోకే రాజకీయాలను బయటి నుంచి నియంత్రిస్తున్నాయి.
స్థానిక పీవోకే ప్రజల ఆకాంక్షలు, సమస్యలు వెనక్కి నెట్టబడుతున్నాయి.
ఈ సీట్లు రాజకీయ ఆధిపత్యం కోసం ‘‘ఇంజనీర్డ్ టూల్’’గా మారాయి.
జేఏఏసీ గతంలో 38 సూచనల జాబితా ఇచ్చింది. పాక్ ప్రభుత్వం 36 డిమాండ్లను అంగీకరించినా, 12 రిఫ్యూజీ సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్ మాత్రం మిగిలిపోయింది.
ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పుతో హింస..
ఈ వివాదం ఇటీవల మరింత రాజేసింది. పీవోకే సుప్రీం కోర్టు ఈ 12 సీట్లు రాజ్యాంగబద్ధమైనవని, వాటిని సాధారణ ఉత్తర్వు ద్వారా రద్దు చేయలేమని తీర్పు ఇచ్చింది. దీనికి నిరసనగా రావలకోట్లో జరిగిన ఘర్షణల్లో పలువురు మరణించారు. జేఏఏసీపై నిషేధం విధించడం, అరెస్టులు కూడా జరిగాయి. ఇది పీవోకేలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేసింది.
వివాదం ఎందుకు..
పీవోకే అసెంబ్లీలో దాదాపు 27 శాతం సీట్లు (12/45) స్థానికులకు కాకుండా బయటి శరణార్థుల ఓట్లపై ఆధారపడి ఉన్నాయి.
ఇది స్థానిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, పాకిస్తాన్ రాజకీయ పార్టీలు పీవోకేను రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నాయని ఆరోపణ. ఆర్థిక సమస్యలు (పిండి, విద్యుత్ ధరలు), అభివృద్ధి లోపం తదితర అంశాలతో కలిసి ఈ రాజకీయ అసమానత హింసాత్మక ఉద్యమంగా మారింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పుడు జరుగుతున్న హింస కేవలం ఆర్థిక సమస్యల వల్ల కాదు. అసెంబ్లీలోని 12 రిఫ్యూజీ సీట్ల వ్యవస్థ స్థానికుల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నుంచి ఉద్భవించింది. స్థానికులకు నిజమైన ప్రాతినిధ్యం కావాలి. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే, పీవోకేలో ఉద్రిక్తతలు మరింత పెరిగి, రాజకీయ పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉంది. జులై 27న జరగనున్న ఎన్నికల ముందు ఈ సమస్య పీవకే రాజకీయాలను ఎలా మార్చనుందనేది అందరూ గమనిస్తున్నారు.

