Site icon OkTelugu

US Iran ceasefire: కన్నింగ్‌ పాక్‌ మధ్యవర్తిత్వం.. అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి కుదిరేనా?

US Iran ceasefire

US Iran ceasefire

US Iran ceasefire: ఇరాన్‌–అమెరికా మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్‌ కుదిరింది. దీనిని శాశ్వత శాంతిగా మార్చేందుకు పాకిస్తాన్‌ యత్నిస్తోంది. ఇందుకు రెండు దేశాల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్‌లో వేదిక ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 10న చర్చలు ప్రారంభమవుతున్నాయి. రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో జరుగుతున్న ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అలీ బాగేరి కౌనీ పాల్గొంటున్నారు. నిలకడ లేని అమెరికా విధానాలు, టెంపరమెంట్‌తో ఊగిపోయే ఇరాన్‌ మధ్య పాకిస్తాన్‌ చేస్తున్న మధ్యవర్తిత్వం ఫలితాన్నిస్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది ఉత్కంఠగా మారింది.

శాంతి కోసం చర్చలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేందుకు పాకిస్తాన్‌∙ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సానుకూలంగా స్పందించారు. ఇరాన్‌–అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు పాకిస్థాన్‌ మధ్యవర్తిగా అవతరించడం ఇదే తొలిసారి. తొలుత చర్చల వార్తలను కొట్టిపారేసిన ఇరాన్, ఇప్పుడు కొన్ని స్నేహపూర్వక దేశాల ద్వారా అమెరికా నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు అంగీకరించింది. ఈ చర్చల్లో రెండు ప్రధాన అంశాలు కీలకంగా మారనున్నాయి. హార్ముజ్‌ జలసంధిపై నియంత్రణ మరియు ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఇరు పక్షాలు తమ పట్టుదలను కొనసాగిస్తాయని అంచనా.

హార్ముజ్‌ జలసంధి నియంత్రణ

పశ్చిమాసియా సంక్షోభానికి సెంటర్‌ ఆఫ్‌ పాయింట్‌ అయిన హార్ముజ్‌ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. సీజ్‌ఫైర్‌ ఒప్పందం కోసం ఇరాన్‌ తన 10 షరతులలో హార్ముజ్‌ గుండా నౌకాయనం కూడా ఉంది. నౌకల రాకపోకలపై హామీతో కూడిన నియంత్రణ కల్పించాలని, చమురు, ఇంధన సరఫరా కోసం సురక్షితమైన నియమావళిపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. హార్ముజ్‌పై తన నియంత్రణను కొనసాగించాలని పట్టుబడుతోంది.

ఇరాన్‌ అణు కార్యక్రమం
చర్చల్లో అమెరికా ఇరాన్‌ ముందు తన డిమాండ్లను ఉంచనుంది. వాటిలో అణు, బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయడం ఉండనుంది. గతంలో టెహ్రాన్‌ ఈ రెండింటినీ తిరస్కరించడం, చివరికి యుద్ధానికి దారితీసింది. ఇరాన్‌ అణు సంస్థ అధిపతి ఇటీవల మాట్లాడుతూ, ‘యురేనియం సమృద్ధి హక్కును రక్షించుకోవడం అవసరం‘ అని ఘాటుగా హెచ్చరించారు. చర్చలు విఫలమైతే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్‌ తేల్చి చెప్పింది.

పాక్‌ మధ్యవర్తిత్వంపై సందేహాలు
పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం విజయవంతమవుతుందా అనే దానిపై అంతర్జాతీయ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు నమ్మకమైన భాగస్వామిగా పాకిస్తాన్‌ ఉంది. ఇరాన్‌తో పాకిస్తాన్‌ సత్సంబంధాలు కలిగి ఉంది. శాంతి చర్చలు సఫలమైతే ప్రాంతీయ శక్తిగా పాకిస్తాన్‌కు గుర్తింపు ఉంటుంది.

అయితే పాకిస్తాన్‌ నిలకడ లేని విదేశాంగ విధానాలు, గతంలో పాక్‌–ఆఫ్గాన్‌ శాంతి చర్చలు విఫలం కావడం, ఇజ్రాయెల్‌–పాక్‌ మధ్య తాజా దౌత్య వివాద, అమెరికా, ఇరాన్‌ మధ్య నమ్మకం లేకపోవడం చర్చలకు విఘాతంగా మారింది.

శాంతి ఒప్పందం ప్రణాళిక
ఏప్రిల్‌ 10న ఇస్లామాబాద్‌లో ఉభయ దేశాల ప్రతినిధులు సమావేశమై ’10 పాయింట్ల శాంతి ఒప్పందం’ ప్రణాళికపై చర్చించనున్నారు. పాక్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ చారిత్రాత్మక పరిణామం చమురు ధరల తగ్గింపుకు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. శాశ్వత కాల్పుల విరమణ, హార్ముజ్‌ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయనం, ఇరాన్‌ అణు కార్యక్రమంపై పరిమితులు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రతా హామీలు, ఉగ్రవాద వ్యతిరేక సహకారం, చమురు సరఫరా హామీలు, దౌత్య సంబంధాల పునరుద్ధరణ, మానవతా సహాయం, భవిష్యత్‌ సంఘర్షణల నివారణ అంశాలు కీలకంగా మారాయి.

చర్చలు ప్రారంభమయ్యే ముందే ఇరాన్‌ ఘాటు హెచ్చరికలు చేసింది. చర్చలు విఫలమైతే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్‌ తేల్చి చెప్పింది. హార్ముజ్‌ను తెరవకపోతే మళ్లీ దాడులు చేస్తామంటూ అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చర్చలు విజయవంతమయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం విజయవంతమైతే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం ఉంది. అయితే, ఇరు పక్షాల పట్టుదల, నమ్మకరాహిత్యం, ప్రాంతీయ శక్తుల జోక్యం ఈ చర్చల విజయాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

Exit mobile version