Pakistan isolated in Islamic world: పశ్చిమాసియా యుద్దానికి ముగింపు పలికి.. అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చి ప్రపంచంలో తన విలువ పెంచుకోవాలని భావించిన పాకిస్తాన్ శాంతి చర్చల ముంగిట బొక్కబోర్లాపడింది. పాకిస్తాన్ శాంతి చర్చలకు ఇరాన్ రానని తెగేసి చెప్పింది. పాకిస్తాన్ను నమ్మడాని వీలులేదని కుండ బద్ధలు కొట్టింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి.. ఆ దేశాన్ని ఇస్లామిక్ సమాజంలోనే ఒంటరిని చేస్తోంది. ఒక్కొక్క ముస్లిం దేశం ఇస్లామాబాద్ నుంచి దూరం అవుతోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసి, 2 బిలియన్ డాలర్లు తక్షణం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. సౌదీ అరేబియా పాకిస్తాన్ యుద్ధ విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇరాన్ అయితే ‘పాకిస్తాన్ నమ్మకమైన మిత్రుడు కాదు‘ అని ప్రకటించింది. మలేషియా కూడా ఈసారి పాక్కు దూరంగా నిలిచింది. ఇస్లామిక్ దేశాల మధ్య పాకిస్తాన్ పూర్తిగా ఏకాంతంలో చిక్కుకుంది.
యూఏఈ ఆగ్రహం..
యూఏఈ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఆర్థిక సంక్షోభ సమయంలో ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణాన్ని తక్షణం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో యూఏఈని ఆహ్వానించకపోవడం కూడా ఈ ఆగ్రహానికి కారణం. ఇరాన్కు అనుకూలంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని యూఏఈ ఆరోపిస్తోంది.
సౌదీ అరేబియా అసంతృప్తి..
సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్పై తీవ్ర అసంతృప్తితో ఉంది. పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానం రియాద్కు నచ్చడం లేదు. గతంలో పాకిస్తాన్తో కుదిరిన రక్షణ ఒప్పందం ఇప్పుడు కాగితపు పులిగా మారింది. సౌదీపై దాడులు జరుగుతున్నా పాకిస్తాన్ కనీసం స్పందించకపోవడం, పాక్–ఆఫ్ఘన్ సరిహద్దుల్లో రక్తపాతం జరుగుతున్నా సౌదీ మౌనం వహించడం ఈ ద్వంద్వ నైజానికి నిదర్శనం. సౌదీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి సైనిక సహాయం కోరడం మానేసింది. 6.3 బిలియన్ డాలర్ల అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెట్టింది.
ఇరాన్ తిరస్కారం..
ఇరాన్ అయితే పాకిస్తాన్పై పూర్తిగా నమ్మకం కోల్పోయింది. ‘పాకిస్తాన్ నమ్మకమైన మిత్రుడు కాదు‘ అని టెహ్రాన్ బహిరంగంగా ప్రకటించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించే చర్చల్లో పాల్గొనమని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్ అమెరికా ఏజెంట్గా వ్యవహరిస్తోందని ఇరాన్ అనుమానిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలన్నింటినీ ఇరాన్ తోసిపుచ్చింది. చరిత్రలో ఇరుదేశాల మధ్య ఉన్న మతపరమైన బంధం ఇప్పుడు పూర్తిగా తెగిపోయినట్లే.
మలేషియా మౌనం..
మలేషియా కూడా ఈసారి పాకిస్తాన్కు దూరంగా నిలిచింది. గతంలో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన మలేషియా, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంలో తటస్థంగా ఉంది. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మలేషియా మద్దతు ఇవ్వలేదు. ఆగ్నేయాసియా ముస్లిం దేశం కూడా పాకిస్తాన్ నుంచి దూరం కావడం ఇస్లామిక్ ప్రపంచంలో ఇస్లామాబాద్ ఏకాంతాన్ని మరింత పెంచింది.
పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో పూర్తిగా ఒంటరి అవుతోంది. మత సోదరులుగా భావించిన దేశాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఇస్లామిక్ ప్రపంచంలోనే విశ్వాసం కోల్పోవడం చరిత్రాత్మక విషాదం. పాకిస్తాన్ ముందు రెండే మార్గాలు ఉన్నాయి. స్వార్థపూరిత విధానం మానేసి, నిజాయితీగా మధ్యవర్తిత్వం వహించడం లేదా ఇంకా ఒంటరిగా మారడం.