Homeఅంతర్జాతీయంNepal political evolution: నేపాల్‌ రాజకీయ పరిణామం: రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు..

Nepal political evolution: నేపాల్‌ రాజకీయ పరిణామం: రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు..

Nepal political evolution: నేపాల్‌ రాజకీయ చరిత్ర హిమాలయాలంత సంక్లిష్టమైనది. రాజరికం, మావోయిజం, ప్రజాస్వామ్యం ఈ దేశ రాజకీయ గతిని రూపొందించాయి. 2008లో రాజరికం అంతమై, ఫెడరల్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌గా నేపాల్‌ మారినప్పటికీ, మావోయిస్టుల ప్రభావం, రాజకీయ అస్థిరత, రాజరికం పునరాగమన డిమాండ్లు దేశాన్ని సవాళ్లలో ముంచెత్తుతున్నాయి.

రాజరికం నుంచి రిపబ్లిక్‌గా..
నేపాల్‌ చరిత్రలో రాజరికం ఒక కీలక భాగం. 18వ శతాబ్దంలో పృథ్వీ నారాయణ షా నేపాల్‌ను ఏకీకృత రాజ్యంగా మార్చాడు. అయితే, 1846 నుంచి 1951 వరకు రాణా వంశం దేశాన్ని నియంత్రించి, రాజులను నామమాత్రపు పాత్రకు పరిమితం చేసింది. 1951లో భారత్‌ మద్దతుతో రాణా పాలన అంతమై, ప్రజాస్వామ్యం ఆరంభమైంది. అయినప్పటికీ, 1960లో రాజు మహేంద్ర పార్టీలెస్‌ పంచాయత్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్య సంస్థలను రద్దు చేశాడు. 1990లో జన ఆందోళన్‌ ఉద్యమం రాజరికాన్ని రాజ్యాంగబద్ధంగా మార్చింది, కానీ 2001లో రాజు బీరేంద్ర కుటుంబ హత్యలు, జ్ఞానేంద్ర ఏకపక్ష పాలన నేపాల్‌ను మళ్లీ అస్థిరతలోకి నెట్టాయి. 2006లో లోక్‌తంత్ర ఆందోళన్, మావోయిస్టులతో శాంతి ఒప్పందం ఫలితంగా 2008లో రాజరికం రద్దయింది. నేపాల్‌ ఫెడరల్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌గా మారింది.

ప్రభుత్వంలో మావోయిజం..
1996లో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌) జన యుద్ధాన్ని ప్రారంభించి, రాజరికం, ఫ్యూడల్‌ వ్యవస్థను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దశాబ్ద కాల యుద్ధం 17 వేల మంది మరణాలకు కారణమై, దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసింది. పేదరికం, అసమానతలు, రాజకీయ అస్థిరతలు మావోయిస్టులకు మద్దతును పెంచాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. 2006లో సెవెన్‌ పార్టీ అలయన్స్‌(ఎస్‌పీఏ), మావోయిస్టుల మధ్య 12–పాయింట్‌ ఒప్పందం శాంతి ప్రక్రియకు దారితీసింది. దీంలో మావోయిస్టులు హింసను విడనాడి, ప్రజాస్వామ్యంలో చేరారు. 2008లో కానిస్టిట్యుయెంట్‌ అసెంబ్లీ ఎన్నికలలో మావోయిస్టులు అత్యధిక సీట్లు గెలిచి, ప్రచండ (పుష్ప కమల్‌ దహల్‌) ప్రధానమంత్రి అయ్యారు. అయితే, మావోయిస్టుల అంతర్గత విభేదాలు, రాజకీయ సంక్షోభాలు దేశాన్ని అస్థిరత వైపు నడిపించాయి.

ప్రజాస్వామ్యంలో అనేక సవాళ్లు..
2008లో రాజరికం రద్దయిన తర్వాత, నేపాల్‌ 2015లో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించి, ఫెడరల్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌గా స్థిరపడింది. అయినప్పటికీ, రాజకీయ అస్థిరత ఒక ప్రధాన సవాల్‌గా మిగిలింది. 1990 నుంచి 2008 వరకు, రాజకీయ పక్షాల మధ్య విభేదాలు, అవినీతి, ప్రభుత్వాల తరచూ మార్పు దేశ అభివృద్ధిని దెబ్బతీశాయి. 2024 జూలైలో ప్రచండ ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించబడి, కేపీ.శర్మ ఓలీ పదవిలోకి వచ్చారు, కానీ 14 నెలల్లోనే ఆయనపై ప్రజాగ్రహం పెరిగింది. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నప్పటికీ, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలు ప్రజల అసంతృప్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో, రాజరికం పునరాగమన డిమాండ్లు, ముఖ్యంగా హిందూ రాష్ట్ర గుర్తింపు డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.

రాజరికం కోసం డిమాండ్‌..
నేపాల్‌లో 2008లో రాజరికం రద్దయినా కొంతమంది నేపాలీలు రాజరికాన్ని రాజ్యాంగబద్ధంగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజరికం దేశానికి స్థిరత్వం, జాతీయ గుర్తింపును అందిస్తుందని వారు వాదిస్తున్నారు, ముఖ్యంగా హిందూ రాష్ట్ర గుర్తింపుతో. ఈ డిమాండ్ల వెనుక రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థిక కష్టాలపై ప్రజల అసంతృప్తి ఉంది. నేపాల్‌ చారిత్రక హిందూ గుర్తింపు, షా వంశం సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ ఉద్యమానికి బలాన్ని ఇస్తున్నాయి. కొందరు వాదనల ప్రకారం, రాజు రాజకీయ పక్షాలకు అతీతంగా ఉండి, దేశ స్థిరత్వాన్ని కాపాడగలడని నమ్ముతున్నారు. అయితే, ఈ డిమాండ్లు భారతదేశంలోని కొన్ని రాజకీయ శక్తుల మద్దతుతో ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లాంటి వ్యక్తుల సమర్థనతో, ఆరోపణలు ఉన్నాయి.

భారత్‌–నేపాల్‌ సంబంధాలు..
నేపాల్, భారత్‌ మధ్య లోతైన సాంస్కృతిక, రాజకీయ అనుబంధం ఉంది. నేపాల్‌ ఒకప్పుడు ఏకైక హిందూ రాష్ట్రంగా గుర్తింపబడింది. దాని సరిహద్దులు భారత రాష్ట్రాలైన సిక్కిం, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో 1,751 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. భారతీయులకు నేపాల్‌కు పాస్‌పోర్ట్‌ అవసరం లేకుండా రాకపోకలు సాగించే స్వేచ్ఛ ఉంది. గూర్ఖాలుగా భారత సైన్యంలో, ఇతర రంగాల్లో చాలా మంది నేపాలీలు పనిచేస్తున్నారు. 1950లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనను జవహర్‌లాల్‌ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్‌ను స్వతంత్ర గణతంత్రంగా చూడాలని కోరుకున్నారని చరిత్రకారులు చెబుతారు. అయితే, నేపాల్‌ రాజకీయ సంక్షోభాలు, ముఖ్యంగా రాజరికం పునరాగమన డిమాండ్లు, భారత్‌ను జాగ్రత్తగా గమనించేలా చేస్తున్నాయి, ఎందుకంటే ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version