NASA Administrator Bill Nelson : అంతరిక్ష ప్రయాణం ప్రమాదకరమే.. నాసా అడ్మినిస్ట్రేటర్‌ సంచలన వ్యాఖ్యలు.. కల్పనా చావ్లా ప్రమాదం ప్రస్తావన!

అంతరిక్షంలో ప్రపంచంలోని చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందుకోసం అక్కడ స్పేస్‌ స్టేషన్‌ను కూడా నిర్మించాయి. ఏటా వ్యోమగాములు అక్కడకు వెళ్లి వస్తున్నారు. ఇందుకోసం వ్యోమ నౌకలు కూడా రష్యా, అమెరికా, చైనా వద్ద ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : September 1, 2024 10:39 am

NASA Administrator Bill Nelson

Follow us on

NASA Administrator Bill Nelson : రోడ్డు మార్గంలో.. వాయు మార్గంలో… నదీ మార్గంలో మనం ఎంత సురక్షితంగా ప్రయాణించినా.. ఎదురుగా వచ్చే వాహనదారులు కూడా జాగ్రత్తగా లేకుంటే.. ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మన పొరపాటు కారణంగా ఎదుటివారు ప్రమాదాలబారిన పడతారు. ఇక అంతరిక్ష ప్రయాణం అంటే.. కొన్ని రోజులు అంతరిక్షంలోనే ఉండాలి అంటే.. అందుకు చాలా ధైర్యం కావాలి. ఎంత రక్షితమైన ఏర్పాట్లు చేసినా అంతరిక్ష ప్రయాణం అత్యంత ప్రమాదకరమే. ఇదే విషయాన్ని ‘నాసా’ అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ కూడా అంగీకరించారు. గతంలో జరిగిన ప్రమాదంలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మృతిచెందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదం తనను కలచివేసిందని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన తోటి వ్యోమగామి బుచ్‌ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారు అంతరిక్షంలోనే కాలం గడుపుతున్నారు. సునీతా విలియమ్స్, బుష్‌ విల్మోర్లు 2025 ఫిబ్రవరి నాటికి తిరిగివచ్చే అవకాశాలున్నాయని నాసా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిల్‌ నెల్సన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చర్చనీయాంశమయ్యాయి.

మొదటి భారత సంతతి మహిళగా చరిత్ర..
కల్పనా చావ్లా భారతీయ అమెరికన్‌ వ్యోమగామి. వృత్తిరీత్యా ఇంజనీర్‌. ఆమె అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 1997లో ఎన్టీఎస్‌–87, 2003లో ఎన్టీఎస్‌–107 అనే రెండు స్పేస్‌ షటిల్‌ మిషన్లలో ప్రయాణించారు. అయితే 2023 ఫిబ్రవరి ఒకటిన రీ–ఎంట్రీ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్‌ షటిల్‌ కొలంబియా కూలిపోవడంతో కల్పనా చావ్లా ప్రాణాలొదిలారు. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. కొలంబియా ప్రమాదానికి ముందు 1986, జనవరి 28న స్పేస్‌ షటిల్‌ ఛాలెంజర్‌ పేలడంతో 14 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సునీతా విలియమ్స్‌ ఉదంతం మరో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాను తలపిస్తోంది. నాటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు నాసా తన ప్రయత్నాలు సాగిస్తోంది.

హరియాణాలో కల్పన విద్యాభ్యాసం..
కల్పన ప్రాథమిక విద్యాభ్యాసం 1976లో హర్యానాలోని కర్నావ్లోని ఠాగూర్‌ బాల్‌ నికేతన్‌ జరిగింది. కల్పన ఎనిమిదో తరగతిలో ఉండగా తాను ఇంజినీర్‌ కావాలనుకున్నారు. 1982లో పంజాబ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా తీసుకున్నారు. యూఎస్‌లో తదుపరి విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె 1994లో నాసాలో వ్యోమగామిగా చేరారు. 1995లో నాసాకు చెందిన వ్యోమగామి కార్ప్స్‌లో చేరారు. 1997లో అంతరిక్షయానానికి ఎంపికయ్యారు.

నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్న నాసా అడ్మినిస్ట్రేర్‌
సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలో చిక్కుకుపోయిన నేపధ్యంలో నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయాణానికి అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అది ప్రమాదకరమేనని అన్నారు. టెస్ట్‌ ఫ్లైట్‌ అనేది సహజంగానే సురక్షితమైనది. బుచ్, సునీతలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచడం, సిబ్బంది లేకుండానే బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ను కిందకు తీసుకురావాలనే నిర్ణయం భద్రతా పరంగా సరైనదే అని అన్నారు. స్పేస్‌ ఎక్స్‌ వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సివస్తుందని తెలిపారు. కల్పనా చావ్లా ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న నాసా ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ను అత్యంత సురక్షితంగా తీసుకురావాలనుకుంటోందని తెలిపారు.