Modi Trump Phone Call Elon Musk Involvement: పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతోన్న యుద్ధ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల ఫోన్ సంభాషణ జరిగింది. ఈ అత్యున్నత స్థాయి చర్చల్లో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యంగా పాల్గొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇరువురు నేతలు మాట్లాడుతుండగా మస్క్ కాల్లో జాయిన్ అయ్యారు. అధికారిక హోదా లేని వ్యక్తి ఇలాంటి సున్నిత భద్రతా సమావేశంలో పాల్గొనడం అసాధారణం, సంచలనం.
కీలక అంశాలపై చర్చ..
మోదీ, ట్రంప్.. సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, హర్మూజ్ జలసంధి తెరిచి ఉంచాల్సిన అవసరంపై చర్చించారు. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ వివరాలను ధ్రువీకరించారు. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం ఈ జలసంధి గుండా వెళ్తుంది. ఇరాన్ దీన్ని మూసివేస్తే ఆయిల్ ధరలు బ్యారెల్కు 150 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. మోదీ హర్మూజ్ను తెరిచి ఉంచడం అత్యవసరమని, భారత నౌకల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు.
మస్క్ ఎందుకు వచ్చాడు?
మోదీ–ట్రంప్ ఫోన్ సంభాషణలోకి మస్క్ ఎందుకు వచ్చాడు. ఈ చర్చలో ఎందుకు పాల్గొన్నాడు? ఆయన ఏం మాట్లాడాడు? అనే దానిపై స్పష్టత లేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ విలేకరుల ప్రశ్నలను తప్పించుకున్నారు. మోదీ–ట్రంప్ సంబంధాలు గొప్పవని, చర్చలు ఫలప్రదమని మాత్రమే పేర్కొన్నారు. అధికారిక ప్రకటనల్లో మస్క్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. విమర్శకులు ఇలాంటి జాతీయ భద్రతా అంశాల్లో ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మళ్లీ దగ్గరవుతున్న మస్క్?
ఎన్నికల సమయంలో ట్రంప్కు ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చాడు. గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఎన్నికల తర్వాత డోజ్ చైర్మన్గా నియమించాడు ట్రంప్. అయితే గతేడాది ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో డోజ్ పదవికి మస్క్ రాజీనామా చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించాడు. తర్వాత కొన్నాళ్లకు ట్రంప్ దంపతులతో మస్క్ ఓ హోటల్లో భేటీ అయ్యారు. తాజా పరిణామం వారి సంబంధాలు మెరుగుపడ్డాయనే సంకేతం అని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. మస్క్ స్టార్లింక్ సాటిలైట్ సేవలు, డ్రోన్ టెక్నాలజీ యుద్ధంలో కీలకం కావచ్చు. ఆయన పాల్గొనడం టెక్నాలజీ, కమ్యూనికేషన్ అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
మోదీ, ట్రంప్ చర్చలు యుద్ధ విరమణకు దారితీసే అవకాశం ఉంది. ట్రంప్ 15 పాయింట్ల శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్కు పంపారు. మోదీ మద్దతు అమెరికాకు బలం ఇస్తుంది. భారత్ రోజుకు 40 లక్షల బ్యారెల్స్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది, యుద్ధం ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగిస్తుంది. మస్క్ చర్చల్లోకి రావడం సాంకేతిక సహకారాన్ని సూచిస్తుంది.