Who Dominates G7 G20 BRICS: ఫ్రాన్స్ వేదికగా జీ-7 సమావేశాలు ఈనెల 17న జరుగనున్నాయి. భారత్ సభ్యదేశం కాకపోయినా మన ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో మోదీ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. అక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని జీ-7, జీ-20, బ్రిక్స్ కూటములపై కొత్త చర్చ మొదలైంది. ఈ మూడింటిలో ఆధిపత్యం ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది..
జీ-7 సమూహం..
అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల సంఘం ఇది. ఇందులో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, కెనడా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ జీడీపీలో సుమారు 40-45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అలాగే అధునాతన సాంకేతికత, ఆర్థిక సంస్థలు (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు) రిజర్వ్ కరెన్సీలు (ముఖ్యంగా అమెరికన్ డాలర్), బహుళజాతి కంపెనీలు, సైనిక పరంగా గణనీయమైన నియంత్రణ ఉంది. జీ7 దేశాలు టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థలు, గ్లోబల్ ఫైనాన్స్లో ఇంకా బలంగా ఉన్నాయి. అయితే వీటిలో జనాభా వృద్ధి తగ్గుతోంది, ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాతో పెరుగుతున్న పోటీ కారణంగా జీ-7 దేశాలు ఒక్కటై పనిచేస్తున్నాయి.
బ్రిక్స్ విస్తరణ…
పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు 2009లో బ్రిక్స్ ఏర్పడింది. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా ఉన్నాయి. తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా చేరాయి. బ్రిక్స్ బలం దాని జనాభా (ప్రపంచ జనాభాలో 40 శాతం కంటే ఎక్కువ), వనరులు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి. చైనా, ఇండియా వంటి దేశాలు తయారీ రంగం, డిజిటల్ ఎకానమీ, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి సాధించాయి. బ్రిక్స్ దేశాలు కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏర్పాటు చేసి, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రష్యా-చైనా సన్నిహిత సంబంధాలు వంటి అంతర్గత వ్యత్యాసాలు బ్రిక్స్ ఐక్యతకు సవాల్గా ఉన్నాయి.
జీ-20కి పరిమితులు..
జీ-20ని 1999లో జీ-7 ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను కలుపుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇందులో జీ-7 దేశాలతో పాటు బ్రిక్్స దేశాలు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, సౌదీ అరేబియా వంటి 20 దేశాలు ఉన్నాయి. జీ-20 ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పు, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించే వేదికగా పనిచేస్తుంది.అయితే జీ-20కి బైండింగ్ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఇది ఎక్కువగా చర్చా వేదికగానే మిగిలిపోతోంది. జీ-7, బ్రిక్స్ దేశాలు రెండూ ఉన్నందున, తరచూ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యం పరంగా జీ-7 ఇంకా ముందంజలో ఉంది. డాలర్ ప్రాబల్యం, అధునాతన టెక్నాలజీ, పశ్చిమ దేశాల సైనిక బలంతో జీ-7 తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. అయితే బ్రిక్స్ జనాభా, వనరులు, ఆర్థిక వృద్ధి రేటు ద్వారా తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ (డాలర్ ఆధిపత్యం తగ్గించడం), స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. జీ-20 మాత్రం రెండు వైపుల మధ్య సమన్వయం చేసే వేదికగా ఉంటుంది కానీ నిర్ణయాత్మక శక్తి కలిగి లేదు.

