Italy : ఇటలీలో బానిసత్వం.. 33 మంది భారతీయ కార్మికులకు విముక్తి వెనుక కథ

ఎక్కువ వేతనం వస్తుందని ఆశపడి వెళితే అక్కడ ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. వర్క్‌ వీసా ఉంటే మాత్రమే వెళ్లాలని, నిబంధనలు, వర్క్‌ నేచర్‌ తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.

Written By: NARESH, Updated On : July 15, 2024 11:04 am

Emancipation of 33 Indian laborers enslaved in Italy

Follow us on

Italy : ఇటలీలో బానిసత్వం పెరిగిపోతోంది. అక్కడ కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో దొరికిన కూలీలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ఎక్కువగా పని చేయించుకుని తక్కువ వేతనం ఇస్తున్నారు. ఇక కూలీల కొరత తీరుస్తామని కొంతమంది ఏజెంట్లు.. విదేశాల నుంచి ఉపాధి నిమిత్తం యువతీ యువకులను ఇటలీకి తీసుకెళ్తున్నారు. అక్కడ ఉద్యోగం, నివాసం కల్పిస్తామని ఆశ చూపుతున్నారు. ఇందు కోసం నిరుద్యోగుల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తీరా ఇటలీ వెళ్లాక అక్కడి పరిస్థితులు వేరేలా ఉంటున్నాయి. పనిభారం, వేధింపులు భరించలేక, తిరిగి స్వదేశాలకు వెళ్లలేక బానిసలుగా బతకాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ కూలీలను బానిస బతుకుల నుంచి అక్కడి పోలీసులు విముక్తి కల్పించారు.

33 మందికి విముక్తి…
ఇద్దరు వ్యక్తుల చేతిలో బానిసలుగా పనిచేస్తున్న 33 మంది భారతీయ కూలీలకు ఇటలీ పోలీసులు శనివారం(జూలై 13న) విముక్తి కల్పించారు. ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో ఈ 33 మంది పనిచేస్తున్నారు. వీరిని యజమానుల నుంచి విడిపించడంతోపాటు కార్మికులకు రావాల్సిన వేతనాల కోసం అరబిలియన్‌ యూరోలు(సుమారు రూ.45 లక్షలు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సీజనల్‌ వర్క్‌ పేరుతో..
కొంతమంది ముఠాలు సీజనల్‌ వర్క్‌ పేరుతో భారత్‌ నుంచి వ్యవసాయ పనుల కోసం ఇటలీ తీసుకెళ్తున్నారు. వారికి ఇటలీలో మంచి ఉపాధి కల్పిస్తామని నమ్మిస్తారు. ఇందుకు 1,700 యూరోలు(సుమారు రూ.15 లలు) కట్టాలని సూచిస్తారు. అక్కడికి వెళ్లాక వారానికి 7 రోజుల పని ఉంటుందని, రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయాల్సి ఉంటుందని చెబుతారు. గంటకు నాలుగు యూరోలు వేతనంగా ఇస్తారని చెబుతారు. ఈమేరకు ఒప్పందం కూడా చేసుకుంటారు. కానీ, ఇటలీ వెళ్లాక కార్మికులను బానిసలుగా చూస్తున్నారు.

పర్మినెంట్‌ జాబ్‌ కోసం..
ఇక అక్కడ పని భారంపై ఏజెంట్లను ప్రశ్నిస్తే… మరికొంత డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తే పర్మినెంట్‌ జాబ్‌ ఇప్పిస్తామని ఫలితంగా పని భారం తగ్గుతుందని నమ్మిస్తున్నారు. ఇటలీ నుంచి పర్మినెంట్‌ వర్క్‌ పర్మిట్‌ కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇక శాశ్వత వర్క్‌ పర్మిట్‌ వస్తే ఉద్యోగ భద్రతతోపాటు, ఇల్లు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని ఆశ చూపుతున్నారు. ఈ మాటలు నమ్మి కొందరు మరింత డబ్బు కడుతున్నారు. కానీ బానిసత్వంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండడం లేదు.

కార్మికుల కొరత తీర్చేలా..
ఇతర యూరోపియన్‌ దేశాలతో పోలిస్తే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో అక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంలో ఇతర దేశాల నుంచి వ్యవసాయ కార్మికులను తీసుకెళ్లి మోసాలకు పాల్పడుతున్నారు. లేబర్‌ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..
ఇటలీ అతి చిన్న దేశమైన ధనిక దేశం. అక్కడ ప్రభుత్వ నిబంధనలు కూడా కఠినంగానే ఉంటాయి. అయినప్పటికి కొన్ని ముఠాలు నిబంధనలకు విరుద్ధంగా యజమానులతో మాట్లాడుకుని ఇతర దేశాల నుంచి కూలీలను ఉపాధి కోసం ఇటలీ తీసుకెళ్తున్నాయి. ఇటలీకి వచ్చిన వారితో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నాయి. ఇలాంటి ముఠాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. మోసాలు మాత్రం ఆగడం లేదు. విదేశీయులు కావడంతో స్థానిక చట్టాలు వర్తించడం లేదు. ఇదే కూలీలను తరలించే ముఠాలకు వరంగా మారుతున్నాయి.

అప్రమత్తంగా ఉండాలి..
ఉపాధి పేరుతో తీసుకెళ్లే ఏజెంట్ల పట్ట అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ వేతనం వస్తుందని ఆశపడి వెళితే అక్కడ ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. వర్క్‌ వీసా ఉంటే మాత్రమే వెళ్లాలని, నిబంధనలు, వర్క్‌ నేచర్‌ తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.