Ali Khamenei: భారత్ లో మైనారిటీలపై ఇరాన్ అధినేత వివాదాస్పద ట్వీట్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజు మిలాద్‌ ఉన్ నబీని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం(సెప్టెబర్‌ 16న) ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం దేశాల్లో అయితే ర్యాలీలు, సభలు నిర్వహించారు. మహ్మద్‌ ప్రవక్త సందేశం వినిపించారు. అందరూ పండుగ సంబురాల్లో ఉంటే.. ఇరాన్‌ అధినేత ఓ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. ఇందులో భారత్‌ గురించి ప్రస్తావించాడు. దీనిపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Written By: Raj Shekar, Updated On : September 17, 2024 3:11 pm

Ali Khamenei

Follow us on

Ali Khamenei: భారత్‌ తమకు మిత్రదేశమని ఇరన్‌ పేర్కొంటుంది. కానీ, అప్పుడప్పుడు భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. భారత నిర్ణయాలను వ్యతిరేకిస్తుంది. ఇలా చేయడం ద్వారా భారత అసంతృప్తిని ఎదుర్కొటుంది. తాజాగా ఇరాన్‌ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ మరోసారి ఇరాన్‌ భారత వ్యతిరేక వైఖరిని బయటపెట్టింది. ఇరాన్‌ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ట్వీట్‌లో ముస్లింల గురించి ఇరాన్‌ సుప్రీం ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. భారత్‌తోపాటు గాజా, మయన్మార్‌లో ముస్లింలకు కష్టాలు తప్పడం లేదని తెలిపారు. వారి బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా ఇస్లామిక్‌ ఉమ్మత్‌గా మా భాగస్వామ్య గుర్తింపునకు సంబందించి ఇస్తాం శత్రువులు ఎల్లప్పుడూ మమ్మల్ని ఉదాసీనంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఘాటుగా రిప్లయ్‌ ఇచ్చిన భారత్‌..
ఇరాన్‌ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ చేసిన ట్వీట్‌పై భారత ఘాటుగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మైనారిటీల గురించి వ్యాఖ్యనించే దేశాలు తమ సొంత రికార్డు చూసుకోవాలని కౌంటర్‌ ఇచ్చింది. ఈమేరకు విదేశాగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ‘భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై ఇరాన్‌ సుప్రీం ఖమేనీ చేసిన ట్వీట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం.. తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు.. మా దేశలో మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే దేశాలు వారి సొంత రికార్డును పరిశీలించుకోవాలి’ అని పేర్కొన్నారు.

2019లోనూ..
ఇరన్‌ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల పరిస్థితిపై గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. 2019లో ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌తో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయంటూనే కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించాడు. భారత్‌లో ముస్లింలపై అణచివేత, బెదిరింపులు నిరోధించాలని కోరుతున్నాం అని పేర్కొన్నాడు. అయితే.. మోరల్‌ పోలీసింగ్‌ పేరుతో ఇరాన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అక్కడి ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2022, సెప్టెంబర్‌ 16న అమిని అనే 22 ఏళ్ల మహిళను ఇరాన్‌ పోలీసుల అరెస్టు చేశారు. ఆమె ఆస్పత్రిలో మరణించింది. హిజాబ్‌ ధరించలేదన్న కారణంతో పోలీసులు అరెస్టు చేయగా, ఆమె మరణించడంతో ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం ఉధృతమైంది.

ద్వైపాక్షిక సంబంధాలు..
ఇదిలాంటే..భారతదేశం, ఇరాన్‌ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పంచుకుంటున్నాయి, ఇటీవలి కాలంలో గణనీయమైన అంతరాయాలు లేవు. ఈ భాగస్వామ్యానికి కీలకమైన అంశం ఏమిటంటే, వ్యూహాత్మక చాబహార్‌ పోర్ట్‌లో భారతదేశం పాల్గొనడం. ఇక్కడ టెర్మినల్‌ను భారత ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీ నిర్వహిస్తుంది. జూలైలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ టెహ్రాన్‌లో జరిగిన ఇరాన్‌ కొత్త అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.