China Underwater Data Centers: ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపి కట్టెది మరొక దారి అన్నట్టుగా.. చైనా తీరు ఉంటుంది. ప్రపంచ దేశాలు ఒకదారిలో వెళ్తూ ఉంటే.. చైనా మాత్రం ప్రత్యేక దారిలో వెళ్తూ ఉంటుంది. అందులో కష్టాలు ఎదురైనా.. నష్టాలు పలకరించినా.. అద్భుతాలు ఆవిష్కృతమైనా చైనా వాటిని సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ఉంటుంది. అందువల్లే శాస్త్ర సాంకేతిక రంగాలలో అమెరికానే కాదు జపాన్, ఇండియా, ఇజ్రాయిల్ వంటి దేశాలకు గట్టి సవాల్ విసురుతోంది చైనా.
ఆపిల్ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. చివరికి చైనాలో కూడా ఆపిల్ కంపెనీ ఫోన్లు విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. ఇది చైనా దేశానికి ఇబ్బందికరంగా మారింది.. మరో మాటకు తావు లేకుండా దాదాపు సింహభాగం బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఆర్ అండ్ కి కేటాయించింది. మొదట్లో సానుకూల ఫలితాలు రాలేదు. అయినప్పటికీ చైనా వెనుకడుగు వేయలేదు. ప్రయోగాలలో మరింత వేగం పెంచింది. ఫలితంగా వివో, ఒప్పో, షావోమి బండి కంపెనీలు స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొన్నాయి. చైనా నుంచి మొదలు పెడితే ఇండియా వరకు అన్ని మార్కెట్లలో ఈ కంపెనీలదే గుత్తాధిపత్యం. చివరికి అంతటి ఆపిల్ కూడా తన అసెంబ్లింగ్ యూనిట్లను చైనాలో ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనా ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీకి సరికొత్త పాఠాలు చెబుతోంది. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో అన్ని సంస్థలు డేటా సెంటర్లను విరివిగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల గూగుల్ సంస్థ అమెరికా వెలుపల భారత్ లోని విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే ఉష్ణోగ్రతతో పాటు.. భారీగా నీటి వినియోగం కూడా అవసరం పడుతుంది. వీటి పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణహితంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
డేటా సెంటర్ల వల్ల ఏర్పడే ముప్పును ముందుగానే గ్రహించిన చైనా.. ఏకంగా సముద్రం అంతర్భాగంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల నీటి వినియోగం ఉండదు. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉండదు. పైగా ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు పెద్దగా ప్రమాదం ఉండదు.. అందువల్లే చైనా చాలా ముందు చూపుతో సముద్ర అంతర్భాగాలలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు ఇంటర్నెట్ కేబుళ్లు సముద్రం అంతర్భాగంలోనే ఉండేవి. ఇప్పుడు డేటా సెంటర్లను కూడా సముద్ర అంతర్భాగంలో ఏర్పాటు చేస్తూ చైనా ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు చెబుతోంది. చైనా చేసిన ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో.. మిగతా దేశాలు కూడా ఇదే దారిలో వెళ్తాయని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు.