China And India: మోడీ దౌత్యం.. లఢక్‌ నుంచి డ్రాగన్‌ బలగాలు వెనక్కి.. చైనా–భారత్‌ మధ్య యుద్ధానికి ముగింపు పడినట్టేనా?

బ్రిక్స్‌ 16వ శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజాన్‌లో అక్టోబర్‌ 23 నుంచి 24వ తేదీ వరకు జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి రష్యా వెళ్లిన మోదీ మరో సంచలనం సృష్టించారు. రష్యా సహకారంతో చైనా మెడలు వంచారు.

Written By: Raj Shekar, Updated On : October 25, 2024 1:17 pm

China And India

Follow us on

China And India: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు.. ఓ సినిమాలో త్రివిక్రం రాసిన డైలాగ్‌ ఇది. కానీ, నూటికి నూరు శాతం ఇది నిజం. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే చేశారు. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశం డ్రాగన్‌పై ఢీ అంటే ఢీ అన్న మోదీ.. ఈ విషయంలో బ్రిక్స్‌ వేదికగా తన దౌత్య చతురతను మరోమారు చాటుకున్నారు. మిత్రదేశమైన రష్యా అధినేత పుతిన్‌ సహకారంతో చైనా దారిలోకి వచే ్చలా చేశారు. పుతిన్‌ చొరవతో రష్యాలో మోదీ–చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శాంతి, సామరస్యత, విశ్వాసంతో పనిచేయాలని నిర్ణయించారు. సుమారు 50 నిమిషాలు సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చలతో ఇరు దేశాల మధ్య సంత్సంబంధాలకు మళ్లీ మార్గం సుగమమైంది. 2020లో గాల్వన్‌ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రష్యాలో జరిగిన అధినేతల చర్చలు.. ఫలించాయి. ఉన్నతాధికారుల స్థాయి చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులు తగ్గించాలని నిర్ణయించారు.

24 గంటల్లో బలగాల ఉప సంహరణ..
మోదీ–జిన్‌పింగ్‌ మధ్య చర్చలు జరిగిన 24 గంటల్లోనే చైనా వెనక్కు తగ్గింది. భారత్‌–చైనా వాస్తవాదీన రేఖ వెంబడి నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవలే ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహఱణ ప్రక్రియ మొదలైంది తూర్పు లద్దాక్‌ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్‌ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి మరలుతున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు తెలిపారు. తాజా ఒప్పందం మేరకు ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి టెంట్లు తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. చార్డింగ్‌లా పాస్కు సమీపంలో నదికి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెల్తున్నట్లు పేర్కొన్నారు. ఇరువైపులా 10 నుంచి 12 తాత్కాలిక నిర్మాణాలు, 12 డెంట్లు ఉన్నట్లు సమాచారం. బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత డెస్పాంగ్, డెమ్బోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది.

గాల్వన్‌ ఘటన తర్వాత..
వాస్తవాధీన రేక వెంట గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. 2020 గాల్వన్‌ ఘర్షలకు ముందు నాటి పరిస్థితులను కొనసాగించేలా ఇరు దేశాలు చర్యలు చేపట్టాయి. 2020 కి ముందులా ఇకపై ఇరు దేశాల సైనికులు పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈమేరకు ఈ విషయాన్ని బ్రిక్స్‌ వేదికగా ఇరు దేశాల అధినేతలు ధ్రువీకరించారు.

తెలంగాణ కల్నల్‌ మృతి..
2020, జూన్‌ 15న తూర్పు లద్దాక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌–చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన సంతోష్‌ కల్నల్‌ సంతోష్‌ బాబు, 20 మంది భారత సైనికులు మృతిచెందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. అయితే సంఖ్యను వెల్లడించలేదు. కొన్ని నెలల తర్వాత ఐదుగురు చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.