Chaiwali : విసుగెత్తిపోయిన బ్రెయిన్కు రిలాక్సేషన్ అందించే పానీయం అలసిన మనసుకు స్వాంతన నిచ్చే ఓ గమ్మతై ్తన ఔషధం లాంటిది.. ఇప్పుడిది ఉపాధి మార్గంగా కూడా మారిపోయింది. సాక్షాత్తూ దేశ ప్రధానే తాను చాయ్ వాలాను అని చెప్పుకుని చాయ్కి ఎక్కడ లేని హైప్ కల్పించారు మోదీ సక్సెస్ మంత్రా ఇప్పుడు యువతకు కిక్కిచ్చే మంత్రంగా మారిపోయింది. ‘కష్టపడి చదివి.. పేద్ద ఉద్యోగం సాధించాలి’.. ఈ మాటలే వింటూ పెరిగారీ అమ్మాయిలు. పెద్దయ్యాక.. మన కాళ్లమీద మనం నిలబడాలంటే ఉద్యోగమే చేయాలా? వ్యాపారం ఎందుకు చేయకూడదనుకున్నారు. ఇంతకీ వాళ్లు ఎంచుకున్నదేంటో తెలుసా? టీ వ్యాపారం! మన అమ్మాయిలు దేశానికే పరిమితం కాలేదండోయ్. విదేశీ గడ్డపైనా మన చాయ్ సువాసన, రుచుల్ని పరిచయం చేస్తున్నారు. చాయ్వాలీలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చిన్న వ్యాపారాలు మొదలు పెట్టి కోట్లు సంపాదించే రేంజ్కి ఎదుగుతున్నారు.

వేచి చూడలేక..
కోవిడ్ జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. కరోనా తర్వాత ఎందరో ఉపాధి కోల్పోయారు. ఇక కొత్త కొలువులకు ఆస్కారమేది? ఇదే పరిస్థితిని ప్రియాంక ఎదుర్కొంది. ఈమెది బిహార్లోని చిన్న పల్లె. ఎకనామిక్స్లో డిగ్రీ చేసింది. ఉద్యోగాల కోసం చూస్తూ సమయం వృథా చేసుకోవడం కంటే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం నయమనుకుంది. ‘‘ఎంబీఏ చాయ్వాలా’’ ప్రఫుల్ భిల్లోరే గురించి విన్నాక చాయ్వాలీలు ఎందుకుండకూడదు అనుకుంది. ఇంట్లో బ్యాంకు పరీక్షల శిక్షణ కోసం వెళ్తున్నానని చెప్పి ఒంటరిగా పట్నా చేరుకుంది. యూట్యూబ్లో వివిధ రకాల టీల గురించి తెలుసుకుంది. మరింత అనుభవం, అవగాహన కోసం చిన్న చిన్న టీకొట్లకు వెళ్లి పరిశీలించింది. అవగాహన వచ్చాక సొంతంగా ప్రారంభించాలనుకుంది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తే స్థానికురాలిని కాదని తిరస్కరించారు. అలాగని ఆగిపోలేదు. స్నేహితుల సాయంతో కలల దుకాణాన్నీ తెరిచింది. 24 ఏళ్ల ప్రియాంక. ఈమె కథ విని స్థానికులు ఆశ్చర్యపోవడమే కాదు.. అభినందిస్తున్నారు కూడా. విషయం తెలిసి ముందు అభ్యంతరం చెప్పిన అమ్మానాన్నలూ ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు.
ఉద్యోగం వదిలి…
‘నచ్చింది చెయ్.. విజయం అదే వెతుక్కుంటూ వస్తుంది’ ఈ సూత్రాన్ని నమ్ముతుంది నిషా. అందుకే మంచి వేతనమున్నా ఉద్యోగాన్ని వదిలేసింది. ఈమెది రాజ్కోట్. టీపై ఆసక్తి కలిగి ఓ కేఫ్లో చేరి వ్యాపార మెలకువల్ని తెలుసుకుంది. ఉద్యోగానికి స్వస్తి చెప్పి మరీ 2019లో ‘చాయ్ ల్యాండ్’ ప్రారంభించింది. ఇంట్లో వాళ్ల తిరస్కరణలు, లాక్డౌన్లో కష్టాలెదురైనా పట్టువదల్లేదు. కొత్త ప్రయోగాలూ చేస్తుండటంతో ఆదరణ పెరిగింది. ఇప్పుడామె బ్రహ్మాండంగా సంపాదిస్తోంది. ఎందరో మహిళలకీ వివిధ రకాల టీల తయారీపై శిక్షణనిస్తోంది 28 ఏళ్ల నిషా.
పీజీ చదివి..
‘అక్కా.. ఓ మంచి చాయ్! ఓ సెల్ఫీ’ కస్టమర్ల నుంచి టుక్టుకీ రోజూ వినే మాటే ఇది. తను అంత ఫేమస్ మరి! నాన్న వ్యాను డ్రైవర్. అమ్మది చిన్న పచారీ కొట్టు. తనకో అక్క. పిల్లల జీవితాలైనా మెరుగ్గా ఉండాలని ఇద్దరినీ వాళ్ల నాన్న చదివించారు. టుక్టుకీ ఎంఏ ఇంగ్లిష్ చదివింది. ‘ప్రయత్నిస్తే కార్పొరేట్ ఉద్యోగమో.. ప్రభుత్వ కొలువో వస్తుంది. కానీ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. అలాగని రిస్క్ తీసుకోలేను. అప్పుడు తట్టిన ఆలోచన టీ వ్యాపారం. ట్యూషన్లు చెప్పగా వచ్చిన రూ.10 వేలతో 2021 చివర్లో కోల్కతా రైల్వే స్టేషన్లో ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ ప్రారంభించింది. ఇంట్లో చెప్పినపుడు ‘ఉద్యోగం, కాదంటే పెళ్లి చేసుకో’ అన్నారు. కానీ టుక్టుకి పట్టు వదల్లేదు. తర్వాతా చాలా మంది ఇంత చదివి టీ అమ్ముతావా అన్నవారే. కానీ కొద్దిరోజుల్లోనే ఆమె కథ సోషల్ మీడియాలో వైరలైంది. వ్యాపారమూ బాగుంది. దేశవ్యాప్తంగా అవుట్లెట్లను ప్రారంభించడం తన కల అంటోంది 26 ఏళ్ల టుక్టుకీ.
బీటెక్ చదువుతూ.. టీ స్టాల్ నడుపుతూ..
వర్తికాసింగ్ అనే యువతి బీటెక్ పూర్తి చేసింది. ఈమెది హర్యానా. అయితే తాను చదువుకుంటున్న సమయంలోనే.. ఉద్యోగం చేయకుండా.. ఏదైనా సొంత వ్యాపారం చేయాలని కలలు కనేది. తన కలను సాకారం చేసుకునేవిధంగా ప్రయత్నం చేసింది. ఆమె సొంతంగా ఓ టీ షాప్ని ప్రారంభించి.. దానికి ‘బీటెక్ చాయ్ వాలి’ అనే పేరుపెట్టింది. ఆమె పెట్టిన టీ షాప్ కొద్దికాలానికే బాగా ఫేమస్ అయింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల నుండి.. రాత్రి 9 వరకు షాప్ నడుపుతాను. నేను పెట్టే స్పెషల్ టీ, మసాలా టీ బాగా ఫేమస్. కస్టమర్లు ఆ టీలను తాగడానికే షాప్కి వస్తారు. నచ్చిన పని చేయడం వలన నేనెంతో సంతోషంగా ఉన్నాను.’ అంటూ చెప్పుకొచ్చారు.
ఆస్ట్రేలియాలో..
‘విర్దీ ఓ కప్పు టీ పెట్టవా.. నేనున్నానంటే అమ్మానాన్న, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇదే మాట. ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళ్లినా అక్కడా ఇంతే. నాదృష్టిలో ఆత్మీయులందరినీ ఒకచోట చేర్చే సాధనమిది. అందుకే ప్రేమతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే హెర్బ్స్నీ జోడిస్తా. ఇది నాకు మా తాతగారి నుంచి వచ్చింది. ఈ రుచుల్ని విదేశీయులకీ పరిచయం చేయాలనుకున్నా. అందుకే చాయ్వాలీ ప్రారంభించా. మొదట హెర్బల్ టీ పొడులను ఆన్లైన్లో అమ్మేదాన్ని. ఖాళీ సమయాల్లో టీ స్టాల్నీ నిర్వహిస్తా. తక్కువ కాలంలోనే వ్యాపారం స్టోర్లు రూపొందించే స్థాయికి ఎదిగింది’ అని ఆనందంగా చెబుతుంది విర్ది. 2016లో ఉత్తమ వ్యాపారవేత్త అవార్డునీ అందుకున్న ఈమెకు మొదట్లో ఇంట్లోవాళ్ల నుంచి ఒత్తిడి ఎదురైంది. తను లాయర్ మరి. ఉద్యోగం చేస్తూనే దీన్నీ కొనసాగిస్తానన్నాక కానీ వాళ్లు ఊరుకోలేదు. వారాంతాల్లో ‘ద ఆర్ట్ ఆఫ్ చాయ్’ పేరుతో టీ పెట్టడంలో శిక్షణనీ ఇస్తోందీమె.
స్నేహితుడితో కలిసి..
తన చదువంతా యూకేలోనే. మన దేశానికి తిరిగొచ్చాక ఇక్కడి రుచుల గొప్పతనం తెలిసింది శోభనకు. ఈ క్రమంలోనే టీల్లో భిన్న రుచులు ఆమెను ఆశ్చర్య పరిచాయి. హోటల్ ఆపరేషన్స్లో ఉన్నతవిద్య పూర్తిచేసింది. బ్రూనెలో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లింది. స్నేహితుడు శరణ్ మంచి ఫుడీ. తనతో కలిసి అక్కడి వాళ్లకు మన దేశీ రుచులను చూపించాలని 2021లో చాయ్వాలీ ప్రారంభించారు. భిన్నరకాల టీలతోపాటు స్ట్రీట్ ఫుడ్నీ అందిస్తున్నారు. కొద్ది కాలంలోనే వ్యాపారం బాగా పుంజుకుంది. అవుట్లెట్లను పెంచే ఆలోచనలో ఉన్నామంటోంది.