Homeఅంతర్జాతీయంBrahMos missile: చైనా పక్కలో బ్రహ్మోస్‌ బల్లెం.. భారత్‌ వ్యూహాత్మక మలుపు

BrahMos missile: చైనా పక్కలో బ్రహ్మోస్‌ బల్లెం.. భారత్‌ వ్యూహాత్మక మలుపు

BrahMos missile: మన చుట్టూ ఉన్న శత్రు దేశాల నుంచి రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. దీంతో చాలా దేశాలు భారత్‌తో డిఫెన్స్‌ డీల్‌ కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ రక్షణ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ షాంగ్రి–లా డైలాగ్‌లో చేసిన ప్రకటన ఇండో–పసిఫిక్‌ భద్రతా వ్యవస్థలో కొత్త చర్చనీయాంశమైంది. ఫిలిప్పీన్స్‌ తర్వాత వియత్నామ్‌తో బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ఒప్పందం సంతకం అయిందని, ఇండోనేషియాతో కూడా చివరి దశల్లో ఉందని ఆయన ప్రకటించారు. వియత్నామ్‌ ఒప్పందం సుమారు 60 బిలియన్‌ రూపాయలు (సుమారు 629 మిలియన్‌ డాలర్లు) విలువైనది. ఇందులో మిస్సైల్‌లు, శిక్షణ, లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌ 2022లో సుమారు 375 మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.

చైనాకు చెక్‌ పెట్టే వ్యూహం..
ఈ ఒప్పందాలు కేవలం వ్యాపారం కాదు.. చైనా ఆధిపత్య ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏర్పడుతున్న ప్రాంతీయ నెట్‌వర్క్‌లో భాగం. భారత్‌–రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆపరేషనల్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్‌. సముద్ర మట్టానికి చాలా దగ్గరగా ప్రయాణం చేసి రాడార్‌లను గుర్తించడం కష్టం. విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలపై శక్తివంతమైన దాడి సామర్థ్యం ఉంది. ఈ మిస్సైల్‌ తీర రక్షణ బ్యాటరీల రూపంలో మోహరించడం వల్ల చైనా నౌకాదళం కార్యకలాపాలకు గణనీయమైన ఆటంకం ఏర్పడుతుంది.

చైనా ఆందోళన..
దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ‘నైన్‌–డాష్‌ లైన్‌’ దావాలు, కృత్రిమ దీవుల నిర్మాణం, మిలిటరైజేషన్‌ ద్వారా ప్రాబల్యం చూపుతోంది. ఫిలిప్పీన్స్, వియత్నామ్‌ వంటి దేశాలు చైనా ఆక్రమణాత్మక చర్యలను ఎదుర్కొంటున్నాయి. బ్రహ్మోస్‌ ఒప్పందాలు ఈ దేశాల సామర్థ్యాలను బలపరుస్తాయి. చైనా ఇలాంటి ఒప్పందాలను ‘‘ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు’’గా, ‘‘బాహ్య శక్తుల జోక్యం’’గా విమర్శిస్తోంది. కానీ ఇది చైనా విస్తరణవాద చర్యలకు సహజమైన ప్రతిస్పందన.

భారత్‌ వ్యూహం..
æఈ ఒప్పందాలు భారత్‌ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, ‘ఆక్ట్‌ ఈస్ట్‌’ పాలసీని బలపరచడం, ఇండో–పసిఫిక్‌లో బహుపాక్షిక భాగస్వామ్యాలు విస్తరించడం లక్ష్యంగా పని చేస్తున్నాయి. క్వాడ్‌ భాగస్వామ్యం, ఆసియాన్‌ దేశాలతో సహకారం ద్వారా భారత్‌ స్వేచ్ఛాయుతమైన, నియమాల ఆధారిత ఇండో–పసిఫిక్‌ను ప్రోత్సహిస్తోంది. ఇది భారత్‌ రక్షణ పరిశ్రమకు కూడా మైలురాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కింద స్వదేశీ తయారీని పెంచి, ఎగుమతుల లక్ష్యాలను సాధిస్తోంది.

ఫిలిప్పీన్స్, వియత్నామ్, ఇండోనేషియా వంటి దేశాల్లో బ్రహ్మోస్‌ నెట్‌వర్క్‌ ఏర్పడటం చైనా నౌకల కదలికలపై నిరోధక శక్తిని సృష్టిస్తుంది. ప్రాంతీయ దేశాల సార్వభౌమత్వం, సముద్ర స్వేచ్ఛను రక్షించడంలో భారత్‌ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది. బ్రహ్మోస్‌ ఒప్పందాలు భారత్‌ యొక్క వ్యూహాత్మక పరిపక్వతను, రక్షణ ఎగుమతి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ఏ ఒక్క దేశం ఏకపక్ష ఆధిపత్యం చెలాయించకుండా సమతుల్య శక్తి నిర్మాణం జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version