
Mahasena Rajesh: ఏపీలో బలమైన నెట్ వర్క్ ఉన్న వ్యక్తుల్లో మహాసేన రాజేష్ ఒకరు. సమకాలిన రాజకీయ అంశాలపై అవగాహనతో పాటు వాటి గురించి సమగ్రంగా విశ్లేషించగలరు. మహాసేన పేరిట యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలను యూట్యూబ్ వేదికగా చేసుకొని ఎండగడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. అతడిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. అర్ధరాత్రి అరెస్టులతో పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. అటు అధికార పార్టీ బెదింపులు నిత్యకృత్యమయ్యాయి. కానీ మహాసేన రాజేష్ అనూహ్యంగా టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో సమావేశం కావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
Also Read: AP Early Elections: ఏపీలో సెప్టెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు.. చరిత్ర ఏం చెబుతోంది ?
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మహాసేన రాజేష్ పార్టీ గెలుపునకు చాలా కష్టపడ్డారు. అప్పట్లో పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించేవారు. కానీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత పార్టీకి దూరమయ్యారు. పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం మొదలుపెట్టారు. క్రమేపీ విమర్శల డోసు పెంచారు. దీంతో వైసీపీ సర్కారు కత్తికట్టి మహాసేన రాజేష్ పై కేసులు నమోదు చేయించింది. వేధింపులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాగబాబులు రెస్పాండ్ అయ్యారు. అప్పటి నుంచి రాజేష్ జనసేనకు అనుకూలంగా మారారు. పవన్ పై భక్తిని చాటుకున్నారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు పవన్ పై చేసిన కామెంట్స్ ను గుర్తుచేసుకొని క్షమాపణలు కూడా కోరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది.
అయితే మహాసేన రాజేష్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. యూట్యూబ్ చానల్ వేదికగా వారిద్దరికీ మద్దతుగా మాట్లాడుతున్నారు. వారిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. టీడీపీ, జనసేన కూటమి ఖాయమన్న పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడి ఉంటారని అంతా భావించారు. ఆయన మాటలు బట్టి చూస్తే జనసేనలో తప్పకుండా చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన అనూహ్యంగా టీడీపీలో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

మహాసేన రాజేష్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి. దళిత సంఘాలతో మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో మంచి నెట్ వర్క్ ఉంది. గత ఎన్నికల్లో రాజేష్ సేవలను వైసీపీ బాగానే వినియోగించుకుంది. కానీ అధికారం చేపట్టిన తరువాత పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో రాజేష్ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో చేరితే ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒక ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్ని ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే జనసేనలో చేరాలనుకుంటున్న రాజేష్ తన అభిప్రాయాన్ని త్వరలో చెబుతానని చెప్పినట్టు తెలుస్తోంది.
Also Read:AP Political Survey : ఆత్మసాక్షి సర్వే.. ఏపీలో గెలిచే పార్టీలు ఇవే !
