Secunderabad: ఆ భారీ బంగారం చోరీ వెనుక రెండు సినిమాలు.. అసలు ట్విస్ట్ ఇదే!

స్థానికులిచ్చిన సమాచారంతో మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే దొంగలు మహారాష్ట్ర పారిపోయారని గుర్తించి, స్పెషల్‌ ఫోర్స్‌ను మహారాష్ట్రకు పంపించారు.

Written By: Raj Shekar, Updated On : May 31, 2023 12:32 pm

Secunderabad

Follow us on

Secunderabad: సికింద్రాబాద్‌లో 3 రోజుల కిందట సినీ ఫక్కీలో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురిని అరెస్ట్‌ చేయడంతోపాటు.. 6 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సినిమాలు చూసి వీళ్లు ఈ దొంగతనానికి పాల్పడిన విషయాన్ని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులమంటూ..
ఈనెల 27న సికింద్రాబాద్‌లోని ఓ బంగారం షాపులోకి ఇన్‌కంట్యాక్స్‌ ధికారులమంటూ ఒకరి తర్వాత ఒకరిగా 10 మంది ప్రవేశించారు. మోండా మార్కెట్లో రద్దీగా ఉన్నప్పటికీ, పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ వీళ్లు ప్లాన్‌ అమలు చేశారు. బంగారం కొనుగోళ్లలో అవకతవకలు ఉన్నాయని, షాపును సీజ్‌ చేస్తున్నామని బిల్డప్‌ ఇచ్చారు. 1,700 గ్రాములకు ఎలాంటి రశీదులు, ట్యాక్సులు లేవంటూ.. ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వెళ్తూ షాపుకు బయట నుంచి షట్టర్‌ వేసి వెళ్లారు. కాసేపటికి యజమాని చుట్టుపక్కల షాపులో పనిచేస్తున్న వాళ్ల సహాయంతో షట్టర్‌ ఓపెన్‌ చేయించాడు.

మోసపోయామని గుర్తించి..
స్థానికులిచ్చిన సమాచారంతో మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే దొంగలు మహారాష్ట్ర పారిపోయారని గుర్తించి, స్పెషల్‌ ఫోర్స్‌ను మహారాష్ట్రకు పంపించారు.

నలుగురి అరెస్ట్‌..
చోరీకి పాల్పడిన జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌ అనే నలుగురిని పోలీసులు మహారాష్ట్రలో అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీళ్ల నుంచి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆ రెండు సినిమాలే వారికి స్ఫూర్తి..
విచారణలో దొంగలు విస్తుపోయే వివరాలు చెప్పారు. పోలీసులకే ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ వివరాల్ని వెల్లడించిన సీవీ ఆనంద్‌.. స్పెషల్‌ ఛబ్బీస్, గ్యాంగ్‌ అనే సినిమాలు చూసి వీళ్లు ఈ దోపిడీకి పాల్పడినట్టు చెప్పారని తెలిపారు. అందులో చేసినట్లుగానే ఐటీ ఆఫీసర్ల పేరుతో దాడి చేసినట్లు వెల్లడించారు.

కలిసి వచ్చిన ఇటీవలి ఐటీ దాడులు..
మరోవైపు తెలంగాణలో ఇటీవలి కాలంలో ఐటీ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. రియల్‌ వ్యాపారులు, జ్వల్లరీ షాపుల యజమానులు, పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇదే అనువైన సమయంగా భావించిన దొంగలు సినిమాలోని ప్లాన్‌ను అమలు చేశారని తెలుస్తోంది.