K. Viswanath Passed Away: పాత్రికేయమంటే ఇప్పుడు డప్పు కొట్టే వ్యవహారం లాగా మారింది.. పొలిటికల్ వార్తలు, వండి వార్చే వార్తలు పక్కన పెడితే.. ప్రత్యేక సందర్భాల్లో పాత్రికేయం దమ్ము చూపించాల్సి ఉంటుంది.. అలా కుదరని పక్షంలో అది పాత్రికేయం అనబడదు.. ఇక తెలుగు నాట ప్రింట్ మీడియాలో టాప్ త్రీ పేపర్లుగా సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి చలామణి అవుతున్నాయి.. అయితే ఈ పేపర్ల యజమానులకు ఎవరి పొలిటికల్ లెక్కలు వారికి ఉన్నాయి. అవన్నీ పక్కన పడితే ప్రొఫెషనలిజం ప్రదర్శించే సమయంలో జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు కంటే వేమూరి రాధాకృష్ణ ముందంజలో ఉన్నారు.. ఎందుకంటే కె విశ్వనాథ్ శివక్యం చెందిన వార్తల కవరేజ్ లో ఆంధ్రజ్యోతి ముందు ఉంది కాబట్టి.. నిజానికి ఇది పోటీ కాదు.. పాత్రికేయులకు ఉండాల్సిన బేసిక్ లక్షణాలు కనిపించని దురవస్థ. తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చిన విశ్వనాథ్ చనిపోతే తెలుగు ప్రధాన పత్రికలు స్పందించిన తీరు ఒకసారి పరిశీలించాలి.. లేకపోతే ఎవరి స్థాయి ఏమిటో తెలియదు.

ఒక సెలబ్రిటీ చాలా రోజులుగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే పత్రికలు ముందే తనకు సంబంధించిన వివరాలతో కథనాలు సిద్ధం చేసి ఉంటాయి.. ఒకవేళ ఆ సెలబ్రిటీ మరణించిన వెంటనే ముందస్తు కథనాలు పేజీలకు ఎక్కుతాయి. కానీ అనుకోకుండా అర్థరాత్రి మరణిస్తే అప్పటికప్పుడు సదరు సెలబ్రిటీ కి చెందిన స్మరణ కథనాలు ప్రిపేర్ చేసి, పేజీలో పెట్టేయడం పెద్ద టాస్క్.. అక్కడే పాత్రికేయ ప్రతిభ కనబడేది. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు రేజ్ కావడం ఏమిటో, దమ్ము ఏమిటో పేదపడేది.
విశ్వనాధ్ మరణ వార్త కాస్త లేటుగా వచ్చింది.. అఫ్కోర్స్ పత్రికల డెడ్లైన్లకు చాలా ముందుగానే… సో, అప్పటికప్పుడు ఆసక్తిని కలిగించే, కనెక్ట్ అయ్యే కథనాలు ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళు పాత్రికేయ పోటీల్లో నిలబడ్డట్టు.. అలాగే ఒక మంచి హెడ్డింగ్ కూడా ముఖ్యమే.. అది సదరు సెలబ్రిటీకి యాప్ట్ గా ఉండాలి. తనేమిటో చెప్పగలగాలి.. సమయంలో ఒక నివాళి అర్పిస్తున్నట్టు కూడా ఉండాలి.. విశ్వనాథ్ కన్నుమూత, కళా తపస్వీ ఇక లేరు…ఇలా ఎవడైనా రాయగలడు.. కానీ రీడర్ కు కనెక్ట్ అయ్యేలా పెట్టడమే పాత్రికేయుడి లక్షణం.
ఆంధ్రజ్యోతిలో విశ్వనాధ్ శివైక్యం వార్తకు సంబంధించి ” నటరాజ పాదాన తలవాల్చన”అని సూపర్ హెడ్డింగ్ పెట్టారు.. వారికి హాట్సాఫ్.. విశ్వనాథ్ తీసిన సాగర సంగమం సినిమాలో చివరి పాట అజరామారం.. ఇందులోని ఒక పాదాన్ని అలాగే విశ్వనాధ్ మరణానికి వర్తింపజేస్తూ… అదే సమయంలో తను శివైక్యం చెందాడ అనే భావనతో మంచి హెడ్డింగ్ పెట్టారు. ఈమధ్య ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజ్ హెడ్డింగ్స్ బాగుంటున్నాయి. ఆ అభిరుచి ఈనాడులో పూర్తిగా కరిగిపోయింది.. సాక్షిలో మొదటి నుంచే ఆ అలవాటు లేదు.. అదొక రొడ్డ కొట్టుడు జర్నలిజం.

ఈనాడు కళాతపస్వి కన్నుమూత ఓ సాదాసీదా హెడ్డింగ్ పెట్టింది.. ఈనాడులో జీతాలు ఎక్కువ, రాతలు తక్కువ అన్నట్టుగా రోజురోజుకూ నాసిరకం ప్రబలుతోంది. ఎవడికి పుట్టిన బిడ్డరా… వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఉంది దాని దుస్థితి. సాక్షి హెడ్డింగ్ ఇంకాస్త నయం “వినువీధికి విశ్వనాథుడు..”ఆంధ్రజ్యోతి ఆ పీక్ అవర్స్ లో కూడా ఫస్ట్ పేజీలో సగం, లోపల ఒకటిన్నర పేజీల కథనాలను ప్రచురించింది.. మంచి ప్రయారిటీ, మంచి ప్రయాస. వాటికి పెట్టిన హెడ్డింగ్ లు కూడా బాగున్నాయి. ” దొరకునా ఇటువంటి సేవ, ఆ ఉచ్ఛ్వాసం కవనం, ఆ నిశ్వాసం గానం, దృశ్యాలనంతాలు నీ వెయ్యి రూపాలు… ఇవన్నీ విశ్వనాథ్ పాటల నుంచి తీసుకున్నవే..
ఈనాడులో కూడా ఒక పేజీ కథనాలు ఇచ్చారు… కానీ ఎందుకో వాటిల్లో డెప్త్ లేదు.. ఏదో మమ అనిపించినట్టుగా రాసినట్టు ఉన్నాయి. ఒక ఫీల్ లేదు. లేకపోతే విశ్వనాథ్ పాటల్లోని గొట్టుభాష లాగే ప్రత్యేక పేజీకి దర్శక రుషి.. అసమాన యశస్వి.. అని హెడ్డింగ్ పెట్టారు.. సాక్షిలో ఒకే ఒక ప్రత్యేక కథనం.. దానికి హెడ్డింగ్ తెలుగు సినిమా ఆత్మగౌరవం.. అత్యంత పేలవమైన కవరేజ్. ఈ నాసిరకం జర్నలిజం కాబట్టే మా పత్రికలు కొనండహో తమ సర్కిల్లో సాక్షి ఉన్నత ఉద్యోగుల నుంచి డైరెక్టర్ల దాకా కాపీలు అమ్ముకునే ప్రయాసలో పడాల్సి వస్తోంది. మొహమాటపు అమ్మకాలు, అంట కట్టడాలు కాదు… కంటెంట్ చందాదారుడుని తీసుకురావాలి. ఈ మూడు తప్ప మిగతా వాటిని ఈ పరిశీలనకు అసలు పరిగణలోకి తీసుకోలేదు. వాటికి పత్రికల లక్షణాలు లేవు కాబట్టి. మాది పత్రికే అని చెప్పుకునే కేసీఆర్ భజన పుత్రిక నమస్తే తెలంగాణతో సహా.. ఎందుకంటే వాటి రంగులు వేరు.. వాటి ఉద్దేశం వేరు.. పాత్రికేయం అనే పరిధిలోకి అవి రావు..రాలేవు.. సూటిగా చెప్పాలంటే నెత్తి మాసిన పత్రికలు.. భజన చేసే యాజమాన్యాలు! అంతకుమించి ఏమీ లేదు.