KCR BRS: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తన ఎనిమిదేళ్ల పాలనలో బంగరు తునక చేశానని చెప్పుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దృష్టాంతా ఇప్పుడు జాతీయ రాజకీయాలవైపు మళ్లింది. గుజరాత్ను మోడల్గా చూపి నరేంద్రమోదీ ఎలా ప్రధాని అయ్యారో.. తాను కూడా తెలంగాణ మోడల్ చూపి ప్రధాని కాకపోయినా.. దేశరాజకీయాల్లో చంక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారీ లక్ష్యంతో తాహతకు మించి చేస్తున్న ఈ ప్రయాణంలో విజయం సాధిస్తానన్న ధీమా కేసీఆర్లో కనిపిస్తోంది. కానీ అదే సమయంలో ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఢిల్లీలో వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 14న పార్టీ కేంద్ర కార్యాలయానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. కొత్త రాజకీయ కాపురం.. అదే రోజునుంచి మొదలు పెట్టాలని నిర్ణయించారు. భారత రాష్ట్ర సమితితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తానని కేసీఆర్ అంటున్నారు. మోదీ సర్కారును గద్దె దించి.. గులాబీ జెండాను ఎర్ర కోటపై రెపరెపలాడిస్తానని కూడా ఆయన ప్రకటించారు. కిసాన్ సర్కారు వస్తుందని ప్రజలకు మాట ఇచ్చేశారు. కానీ.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉండోబోతుంది.. ఎలా ఇతర రాష్ట్రాలలో ప్రజాదరణను కూడగట్టుకోబోతోంది. ఇలాంటి అంశాలు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. ఈనెల 14న కొన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు..
భారాస ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కేసీఆర్ 14న ఢిల్లీలో తమ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా అక్కడే రాజశ్యామల యాగాన్ని కూడా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 12న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. మంగళవారం ఆయన అనేక మంది జాతీయ పార్టీల నాయకులను కలిసి తమ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. కేసీఆర్ ఏయే పార్టీల నాయకులను కలవబోతున్నారు, ఆహ్వానించబోతున్నారు, పార్టీని ఇతర నాయకులు ఏ స్థాయిలో గుర్తిస్తున్నారు.. అనేది ఇక్కడే బయటపడుతుంది. ఆయన ఎందరు నాయకులను ఆహ్వానిస్తారో, బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎందరు హాజరవుతారో కూడా గమనించాల్సి ఉంది.
కలిసి వచ్చేదెవరో…
కేసీఆర్ తాను కూడా ఒక పార్టీగా చెలామణీ అవుతూ.. దేశంలో ఇతర పార్టీలు అన్నింటినీ కూడగట్టి.. కలిసి ఒక కూటమిగా మోడీ ప్రభుత్వాన్ని పతనం చేద్దాం అని పిలుపు ఇస్తే వచ్చే రెస్సాన్స్ వేరు. అప్పుడు అందరికీ అందులో భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉంది. అలా.. ప్రత్యామ్నాయ కూటమి కోసం కేసీఆర్ దేశంలోని అనేక రాష్ట్రాలు తిరిగినప్పుడు ఆయనకు పాజిటివ్ స్పందన వచ్చింది. తర్వాత చాలామంది వెనక్కిక తగ్గారు. ఇక ఇప్పుడు పరిస్థితి వేరు. ఆయన తాను సొంతంగా జాతీయ పార్టీనే స్థాపించారు. ఎర్రకోటపై తమ పార్టీ జెండా ఎగరేస్తానని అంటున్నారు. మరి ఇలాంటప్పుడు.. ఆయనతో ఎంతమది కలిసి వస్తారన్నది ఇప్పుడు గులాబీ నేతలననూ టెన్షన్ పెడుతోంది.

వారి రాష్ట్రాల్లోకి వెళ్తే ఊరుకుంటారా?
కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే చాలామంది రావొచ్చు గాక.. కానీ తమ రాష్ట్రాల్లోకి కేసీఆర్ వస్తానంటే మాత్రం ఎందుకు ఊరుకుంటారు. ఒప్పుకుంటే.. పొత్తుల రూపంలో తమ సీట్లు కొన్ని బీఆర్ఎస్కు పంచిపెట్టాల్సి వస్తుంది. ఒప్పుకోకపోతే.. తమ రాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యర్థి అవుతారు. ఇలాంటి సమీకరణల నేపథ్యంలో.. ఇతర జాతీయ పార్టీలతో నిన్నటిదాకా ఉన్న బంధానికి ఇవాళ ఉండగల బంధానికి తేడా ఉంటుందని కేసీఆర్ తెలుసుకోవాలి. ఆదరవుగా ఎవరు దొరికినా చాలు వాడుకుందాం అనే స్థితిలో ఉన్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి పార్టీని ఒప్పించినంత ఈజీ కాదు.. ఉత్తరాది పార్టీలను ఒప్పించడం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ కాపురం ఎలా సాగుతుందో వేచి చూడాలి.