
Jana Sena Avirbhava Sabha: ఇప్పుడు అందరి దృష్టి మచిలీపట్నంపై పడింది. ఎన్నో రాజకీయ ప్రకంపనలకు వేదిక కానుంది. ఈ నెల 14న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ సభ జరగనుంది. వంద ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్న సభకు లక్షలాది మంది జన సైనికులు రానున్నారు. ఇప్పటికే పది రకాల కమిటీలను నాయకత్వం ఏర్పాటుచేసింది. సభకు వచ్చే వారు క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ఈ కమిటీలు చొరవ తీసుకుంటాయి. అటు తెలంగాణ నుంచి సైతం జనసైనికులు రానుండడంతో అక్కడ కూడా కమిటీలు ఏర్పాటుచేశారు. మూడు రోజుల వ్యవధే ఉండడంతో జనసేన కీలక నాయకుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సభా వేదిక, ప్రాంగణం తీర్చిదిద్దే పనిలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి.
జనసేనాని పవన్ ఈ నెల 11 నుంచి నాలుగు రోజుల పాటు బిజిబీజీగా గడపనున్నారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే బీసీ సదస్సులో పాల్గొంటారు. 12న కాపు ఉద్యమ నేత హరి రామ జోగయ్య, కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడనున్నారు. కీలక చర్చలు జరపనున్నారు. ప్రధానంగా ఆవిర్భావ సభలో తీర్మానాలు, పార్టీ బలోపేతం వంటివాటిపై జనసేన నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. 13న ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. దీంతో పవన్ మూడు రోజుల పాటు రాజధాని ప్రాంతంలోనే గడపనున్కనారు.

14న మచిలీపట్నంలో జరిగే పదో ఆవిర్భావ సభకు పవన్ హాజరుకానున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వారాహి వాహనంలో వెళ్లనున్నారు. పవన్ టూర్ షెడ్యూల్ విడుదల కావడంతో జన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పవన్ కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. వైసీపీపై నేరుగా యుద్ధం ప్రకటించనున్నారు. గత ఆవిర్భావ సభ ఇప్పటంలో నిర్వహించారు. ఆ సమయంలో పవన్ చేసిన ప్రకటనలు ఇప్పటికీ సెగలు పుట్టిస్తున్నాయి. అయితే ప్రధానంగా టీడీపీతో పొత్తు, బీజేపీ విషయంలో నడుచుకునే వ్యూహం, వారాహి ప్రచార యాత్ర వంటి విషయాలపై పవన్ స్పష్టత ఇచ్చే చాన్స్ ఉంది. మరోవైపు ఏపీలో వారాహి వాహనాన్ని తిరగనివ్వమని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అయితే నాని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలోనే సభ నిర్వహిస్తుండడం, దానికి వారాహి వాహనంపై వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.