
Chiranjeevi- BJP: మెగాస్టార్ చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందా? తనకు రాజకీయాలు ఇష్టం లేదని చెబుతున్నా వినడం లేదా? ఎలాగోలా ఒప్పించి పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని భావిస్తోందా? ఇందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ను ప్రయోగిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు మరింత నిజం చేకూరుస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. సినిమా ప్రపంచంలోనే గడుపుతున్నారు. పదేళ్ల పాటు రాజకీయరంగం వైపు వెళ్లి తప్పుచేశానని పశ్చాత్తాపపడుతున్నానని ప్రకటించారు. అటువంటి తప్పు ఎప్పుడూ చేయనని కూడా వెల్లడించారు. అయితే అవేవీ పట్టించుకోని బీజేపీ హైకమాండ్ మాత్రం చిరంజీవి కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలవడం, చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2009లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఉమ్మడి ఏపీలో 274 నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. దాదాపు 70 లక్షల ఓట్లు సాధించారు. కానీ కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. అయితే అక్కడికి కొద్దిరోజులకే పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనంచేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కకావికలమైంది. అటు చిరంజీవి రాజ్యసభ పదవీకాలం ముగియడంతో పూర్తిగా రాజకీయాల వైపు కాన్సంట్రేషన్ తగ్గించేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయకున్నా.. ఆ పార్టీ యాక్టివిటీస్ లో మాత్రం పాల్గొనడం లేదు. ఇప్పుడు పూర్తిగా సినిమారంగం వైపే ఉన్నారు. సోదరుడు పవన్ జనసేన పార్టీ యాక్టివ్ గా ఉన్నా డైరెక్ట్ గా మాత్రం సపోర్టు చేయడం లేదు. కానీ కొన్ని అంశాల్లో మాత్రం పవన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.

అయితే చిరంజీవి కోసం భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నం లేదు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దలు చిరంజీవిపై ఆసక్తి చూపుతున్నారు. ఆయన కానీ పార్టీలోకి వస్తే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే చిరంజీవి రూపంలో కాపుల ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నారు. గత ఏడాది గోవాలోని ఐఎఫ్ఎఫ్ఐలో భారత ప్రభుత్వం అతనికి పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆ సమయంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన సుతిమెత్తగా తిరస్కరించారు. తనకు రాజకీయాలు సూట్ కావని తేల్చేశారు. అటు తరువాత ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. వేదికపై సీఎం జగన్ కంటే చిరంజీవికే మోదీ ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో మోదీ చిరంజీవిని బీజేపీలో చేరాలని కోరినట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత ఏడాది గోవాలోని ఐఎఫ్ఎఫ్ఐలో భారత ప్రభుత్వం అతనికి పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించినందున, చిరు అనురాగ్ను గౌరవ సూచకంగా ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ కోసం చర్చలు జరిపారని.. ఈ చర్చల్లో నాగార్జున, అల్లు అరవింద్ సైతం పాలుపంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అనురాగ్ ఠాకూర్ కేంద్ర పెద్దల దూతగా వచ్చారని.. కీలక ప్రతిపాదనలు చిరంజీవి ముందు పెట్టారని టాక్ నడుస్తోంది. దీనిపై ట్విట్టర్ లో చిరంజీవి స్పందించారు. తన ఇంటికి మంత్రి ఠాకూర్ అల్పహారానికి రావడం ఆనందంగా ఉందని ట్విట్ చేశారు. అంతకు మించి వివరాలేవీ వెల్లడించలేదు.
Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday.
Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna
about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39— Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023