
AP New Governor: ఏపీ గవర్నర్ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వభూషణ్ హరిచందన్ అనూహ్య మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్ధుల్ నజీర్ నియామకం కూడా ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విశ్వభూషణ్ హరిచందన్ మార్పును కూడా ఎవరూ ఊహించలేదు. గవర్నర్ ను మారుస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. గవర్నర్ గా చాలామంది పేర్లు కేంద్రం పరిశీలిస్తోందన్న ప్రచారం చాలాసార్లు జరిగింది. కానీ అదంతా ఉత్త ప్రచారమే అని అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఏ హడావుడి లేకుండా.. కనీసం లీకులివ్వకుండా ఏకంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నియామకం వెనుక బీజేపీ రాజకీయం ఎదైనా ఉందా అన్న అనుమానం కలుగుతోంది. అయితే అధికార వైసీపీ కానీ.. విపక్ష టీడీపీ కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. నియామకంపై హర్షం వ్యక్తం చేయలేదు. అభ్యంతరం వ్యక్తం కాలేదు. అయితే దీనిపై పవన్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో న్యాయవ్యవస్థపై అధికార పార్టీ అనుచిత వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. పాలనలో న్యాయవ్యవస్థ ప్రమేయాన్ని సాక్షాత్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ తీరును ప్రశ్నించాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఒకరిద్దరు నేతలు జైలు గడప కూడా తొక్కారు. ఇటువంటి సమయంలో ఒక న్యాయ నిపుణుడ్ని గవర్నర్ గా నియమించడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ నియామకంతో బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. గవర్నర్ ద్వారా రాజకీయాలు చేసే స్థాయి బీజేపీకి ఏపీలో లేదు. అటువంటప్పుడు ఈ గవర్నర్ మార్పు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి అనుకూలమన్న ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ఈ మాజీ న్యాయమూర్తిని గవర్నర్ గా నియమించాలనుకుంటే ఏకంగా చత్తీస్ గడ్ కు పంపించవచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. గత నెల 4న అబ్ధుల్ నజీర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఇంతలోనే ఆయన్ను ఏపీ గవర్నర్ గా నియమించడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు చిక్కుముడిగా మారింది. ఈ విషయంలో కేంద్రం కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం తీసుకుందా? అన్న మాటకు కూడా సమాధానం కరువవుతోంది. ప్రస్తుతానికి గవర్నర్ నియామకంపై వైసీపీ నేతలు గుంభనంగా ఉన్నారు. అటు ప్రతిపక్షం టీడీపీ సైతం ఆసక్తిగా గమనిస్తుందే తప్ప ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. అసలు బీజేపీ ఉద్దేశ్యం ఏమిటన్నది ఒకటి రెండు నెలలో తేలిపోతుంది. అప్పటి వరకూ వేచిచూసే ధోరణిలో ఆ రెండు పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ మాదిరిగా ఏపీలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు. కనీసం శాసనసభలో సంఖ్యాబలం లేదు. అటువంటప్పుడు గవర్నర్ ద్వారా రాజకీయ నిర్ణయాలతో ప్రభావితం చేయాలని బీజేపీ భావిస్తుందా? అన్నది ప్రశ్నే. అటు తాజాగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తికి గవర్నర్ పదవి కట్టబెట్టడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు పదవులు పరంగా లబ్ధిపొందడం ఇది మొదటిసారి కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కేరళ గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ సీజే సదానందంను నియమించారు. తరువాత రంజన్ గొగోయ్ కు ఏకంగా రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు అబ్ధుల్ నజీర్ ను సైతం అదే మాదిరిగా ఏపీ గవర్నర్ గా నియమించారు. అయితే ఏరికోరి ఏపీకి న్యాయ నిపుణుడ్ని గవర్నర్ గా పంపించడం మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇది ఎవరి ప్రయోజనాల కోసమన్నది కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.