
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మనీ లాండరింగ్ కేసులు జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖ, వాట్సాప్ క్లిప్పింగులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 15 కిలోల నెయ్యి.. కోడ్ లాగ్వేంజ్లో చేసిన చాటింగ్, 6060 నంబర్ కారు, ఎమ్మెల్సీ స్టిక్కర్ వంటి అంశాలన్నీ కవితవైపు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో విడుదల చేసిన లేఖపై స్పందించని కవిత, తాజాగా వాట్సాప్ చాట్స్పై మాత్రం స్పందించారు. ‘గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి’ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయస్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ చానెళ్ల ద్రారా పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రణాళిక ప్రకారం.. ప్రచారం..
ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖ విడుదల చేయడం, దానిపై వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని వివరించారు.
సుఖేశ్ ఎవరో తెలియదు..
ఇక సుఖ్శ్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు కవిత. అతనెవరో తనకు తెలియదని పేర్కొన్నారు. వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. ఇదివరకు తన మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేశ్ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని వివరించారు. దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మీడియా సంస్థల తీరు తయారైందని విమర్శించారు.
విలువలు పాటించడం లేదు..
మీడియా సంస్థలు, పాత్రికేయులు కనీస విలువలు పాటించడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారని తెలిపారు. తెలంగాణ సమాజం గ్రహించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలివైన తెలంగాణ..
తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. తెలివైనవారని కవిత తెలిపారు. పాలు ఎంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు అని పేర్కొన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని వెల్లడించారు. కేసీఆర్ మీద కక్ష్యతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఆరోపించారు. అలాంటివారిని తెలంగాణ సమాజం తరిమికొడుతుందని పేర్కొన్నారు.
తనపై బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే తన వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి డిమాండ్ చేశారు. మొత్తంగా కవిత సుఖేశ్ ఎపిసోడ్పై స్పందిస్తూనే మీడియా సంస్థలకు సున్నితంగా చురకలు అంటించారు