Hydrogen Buses: హిందూజా హైడ్రోజన్ బస్.. డిసెంబర్లో రోడ్లపై రయ్యి రయ్యి

అశోక్‌ లేలాండ్‌ 75వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఎలక్ట్రిక్‌ వాహన విభాగం స్విచ్‌ మొబిలిటీ మార్కెట్లోకి తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) విడుదల చేసింది.

Written By: Bhaskar, Updated On : September 8, 2023 5:02 pm

Hydrogen Buses

Follow us on

Hydrogen Buses: ఇప్పటిదాకా మనం డీజిల్ తో నడిచిన బస్సులు చూసాం. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా చూడబోతున్నాం. కానీ వీటన్నింటికీ మిన్నగా హైడ్రోజన్ ఇంధనంగా నడిచే బస్సులు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. రోడ్లమీద రయ్యి రయ్యి మంటూ పరుగులు పెట్టబోతున్నాయి. దీనికి సంబంధించి హిందూజా గ్రూప్ కీలక ప్రకటన చేసింది.

వాణిజ్య వాహనాల మార్కెట్లో..

వాణిజ్య వాహనాల మార్కెట్‌ (సీవీ)లో తమ స్థానాన్ని మరింత పెంచుకోవాలని హిందూ జా గ్రూప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ భావిస్తోంది. అశోక్‌ లేలాండ్‌ 75వ వార్షికోత్సవం సందర్బంగా జరిగిన ఒక కార్యక్రమంలో చైర్మన్‌ ధీరజ్‌ హిందూ జా ఈ విషయం ప్రకటించారు. వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో అశోక్‌ లేలాండ్‌ ప్రస్తుతం ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో కనీసం పదో స్థానానికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హిందూజా ప్రకటించారు.
ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలపైనా దృష్టి పెడుతున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో తమ కంపెనీ తయారు చేసే అన్ని మోడల్స్‌ విద్యుత్‌, సీఎన్‌జీ శ్రేణిలో లభిస్తాయని వివరించింది. విద్యుత్‌, సీఎన్‌జీతో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలనూ మార్కెట్లోకి విడుదల చేయ నున్నట్లు వెల్లడించింది. ఇందులో హైడ్రోజన్‌, ఇథనాల్‌తో నడిచే వాహనాలు కూడా ఉంటాయని పేర్కొంది.

కొత్త మార్కెట్లపై నజర్‌

కొత్త మార్కెట్లపైనా హిందూజా గ్రూప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత 16 నెలల్లో ఆఫ్రికా దేశాల్లో కొత్తగా 13 మంది డీలర్లను నియమించింది. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ‘అవతార్‌’ ట్రక్కును అభివృద్ధి చేసింది.. విద్యుత్‌ వాహనాలు కూడా కంపెనీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రకటించింది.
హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ బస్‌
పెట్రోల్‌, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌తో నడిచే వాహనాలపైనా దృష్టి సారించామని వివరించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైడ్రోజన్‌తో నడిచే ఒక బస్సును అభివృద్ధి చేసింది. ఈ బస్సును ఈ ఏడాది డిసెంబరు నాటికి వాణిజ్య స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ షేను అగర్వాల్‌ చెప్పారు. దట్టమైన మంచు ఉండే లద్దాఖ్‌, లేహ్‌ ప్రాంతాల్లోనే ఈ బస్సును కంపెనీ పరీక్షించింది. ముందుగా ఈ బస్సుల్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీకి సరఫరా చేయనున్నట్టు అగర్వాల్‌ తెలిపారు.

అశోక్‌ లేలాండ్‌ 75వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఎలక్ట్రిక్‌ వాహన విభాగం స్విచ్‌ మొబిలిటీ మార్కెట్లోకి తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) విడుదల చేసింది. ‘ది స్విచ్‌ ఐఈవీ’ సీరిస్ లో విద్యుత్‌ బ్యాటరీతో నడిచే ఐఈవీ3, ఐఈవీ4 మోడల్‌ ఎల్‌సీవీలను కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్‌ ఎల్‌సీవీలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, అశోక్‌ లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా, స్విచ్‌ మొబిలిటీ సీఈఓ మహేశ్‌ బాబు విడుదల చేశారు. ఎంఎఎస్ ఎంఈలు, కాటేజీ పరిశ్రమలు, ఈ-కామర్స్‌ సంస్థల అవసరాలకు ఇవి బాగా సరిపోతాయని కంపెనీ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి ఈ వాహనాలను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయనున్నట్టు వెల్లడించారు. ఐఈవీ సీరిస్‌ వాహనాలు ఒకసారి చార్జింగ్‌ చేస్తే 1.7 టన్నుల బరువుతో 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవన్నారు.