Homeట్రెండింగ్ న్యూస్Vemuri Radha Krishna : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ లో ఏమిటీ హఠాత్పరిణామం?

Vemuri Radha Krishna : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ లో ఏమిటీ హఠాత్పరిణామం?

Vemuri Radha Krishna: సమాజంలో స్థితిగతుల గురించి బయటపెట్టే మీడియాలో జరిగే అంతర్గత విషయాలు కూడా భలే ఆసక్తికరంగా ఉంటాయి.. అలా ఆసక్తిగా అనిపించింది ఓ ఫోటో, దాని వెనుక ఉన్న కథనం కూడా అటువంటిదే.. ఆ కథనం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు సంబంధించింది. తెలుగు నాట రామోజీరావు గతించిన తర్వాత.. ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు (ఓ వర్గం ఈయనపై ఎల్లో జర్నలిస్ట్ అని ముద్ర వేసింది) రాధాకృష్ణ సొంతం. కొంతమందికి ఇది మింగుడు పడకపోయినప్పటికీ ఇది నిజం. ఆంధ్రాలో టిడిపి ప్రభుత్వం ఏర్పడటం, తెలంగాణలో దగ్గర మిత్రుడైన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రాధాకృష్ణ ఖుషి ఖుషి గా ఉన్నాడు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ తో రాధాకృష్ణకు ఉప్పు నిప్పు వ్యవహారమే ఉంది. ఇక ఆంధ్రాలో జగన్ తో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. ఈ నేపథ్యంలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడడంతో రాధాకృష్ణ ఒక్కసారిగా జిల్లాల బాటపట్టాడు. చార్టెడ్ ఫ్లైట్ లో జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఏపీలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి జిల్లాల పర్యటన ముగిసిందని తెలుస్తోంది. జిల్లాల పర్యటనలో భాగంగా అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ, ఏడివిటీ జిఎం శివ ప్రసాద్, సర్క్యులేషన్ జిఎం రామకృష్ణారావు, కొడుకు ఆదిత్యతో కలిసి యూనిట్లు సందర్శిస్తున్నాడు..

కొంతకాలంగా..

కొంతకాలంగా రాధాకృష్ణ ఏబీఎన్ మీదనే దృష్టి సారించాడు. ప్రస్తుతం అది నాలుగో స్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బెటర్ పొజిషనే. ఏబీఎన్ కాస్త గాడిలో పడిన తర్వాత మరోసారి ఆంధ్రజ్యోతిపై రాధాకృష్ణ దృష్టి సారించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడటం, ఈనాడు రామోజీరావును కోల్పోవడం, సాక్షి కి దిశా దశా లేకపోవడం, నమస్తే తెలంగాణ పెద్దగా ప్రభావం చూపించలేని స్థితికి చేరుకున్నాయి. రామోజీరావు మరణించిన తర్వాత ఈనాడు బాధ్యతలను కిరణ్ స్వీకరించాడు. రామోజీరావు బతికి ఉన్నప్పుడు ఈనాడుపై విపరీతమైన పట్టు ఉండేది. ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆయనను కలవడానికి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లేవారు. ఇది ఒక రకంగా రాజకీయాలపై ఆయన పట్టు. ఇప్పుడు ఆయన గతించాడు. ఈనాడు కిరణ్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ.. అది ఎంత కాలం ఉంటుందనేది ఇప్పటికీ అంతు పట్టడం లేదు. ప్రింట్ ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈనాడు పూర్తిగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ ప్రణాళికను ఈనాడు యాజమాన్యం అమలు చేస్తోంది. ఇలా ప్రధాన పత్రికలు వేటికవే ఇబ్బందుల్లో ఉండగా.. ఒకప్పటి రామోజీరావు లాగా రాధాకృష్ణ జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టాడు.

ఎడిటర్ లేకుండానే..

ఎడిటర్ శ్రీనివాస్ లేకుండా, నెట్వర్క్ ఇన్చార్జి కృష్ణ ప్రసాద్ లేకుండా వక్కలంక రమణను వెంటబెట్టుకొని రాధాకృష్ణ పర్యటనలు చేయడం నిజంగా ఆసక్తికరమే. పక్కనే కొడుకు ఉన్నప్పటికీ.. ఆయనకు దీని గురించి పెద్దగా తెలిసినట్టు లేదు. ఆంధ్రజ్యోతిలో బ్రాంచ్ మేనేజర్లు సంవత్సరాలుగా పాతుకు పోయారు. బ్యూరో ఇన్చార్జులు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిషన్ ఇన్చార్జులు ఇలా ఎవరికివారు ఎడిషన్లను సామంత రాజ్యాలుగా చేసుకున్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం. పైకి దమ్మున్న పత్రిక అని రాధాకృష్ణ చెబుతుంటాడు గాని.. కాంగ్రెస్ పార్టీలో మించిన రాజకీయాలు ఆంధ్రజ్యోతిలో ఉంటాయి. అనుకూల ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ ఆంధ్రజ్యోతిలో డెస్క్ లు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జర్నలిజం కాలేజీ నోటిఫికేషన్ వేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలోనూ నోటిఫికేషన్ వేశారు. డిజిటల్ మీడియా వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రింట్ మీడియాలో పనిచేసేందుకు.. మరీ ముఖ్యంగా డెస్క్ లలో పని చేసే సబ్ ఎడిటర్లు కరువైపోయారు. ఈ దుస్థితి ఇందాక వెళ్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే ఆంధ్ర జ్యోతిలో డెస్క్ ల పరంగా పరిస్థితి బాగోలేదు.

ఆ సమర్థత ఉంది

ఇక తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బాబు చేసిన వ్యాఖ్యల ప్రకారం.. బాబు పార్టీకి ఆంధ్రజ్యోతి తెలంగాణలో చాలా అవసరం. పైగా ఆ పత్రికకు యెల్లో మౌత్ పీస్ అనే పేరు కూడా ఉంది. ఎలాగూ రామోజీరావు గతించిపోయాడు. ఆ స్థానాన్ని భర్తీ చేసే సమర్థత రాధాకృష్ణకు ఉంది. అందు గురించే ప్రత్యేక విమానంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు. దీనివల్ల ఆంధ్రజ్యోతి బాగుపడుతుందా? మరింత దూసుకెళ్తుందా? అనేది పక్కన పెడితే.. ప్రింట్ మీడియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రాధాకృష్ణ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టడం ఒక రకంగా సాహసమనే చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular