Mancherial: ప్రేమించడం లేదుని.. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతు కోస్తున్న ప్రియుడి ఉదంతాలు ఇటీవల పెరిగాయి. తాజాగా హైదరాబాద్లో కూడా ఓ యువతి పెళ్లికి ఒప్పుకోవడం లేదని గొంతు కోశాడో యువకుడు. కొంతమంది యువతితోపాటు వారి కుటుంబ సభ్యులపైనా దాడిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాత్రం ప్రియుడినే లేపేశారు. నిత్యం వేధిస్తున్నాడని అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై కిరాతకంగా హతమార్చారు. ఇందులో మాజీ ప్రేయసితోపాటు ఆమె సోదరుడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వేధింపులు భరించలేక..
మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన ముష్కే మహేశ్కు గ్రామానికి చెందిన ఓ యువతి గతంలో ప్రేమించుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు. దీంతో ఆగ్రహించిన మహేశ్ యువతిని వేధించడం ప్రారంభించాడు. ఈ విషయమై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా మహేశ్ తీరు మారలేదు.
యువతి భర్తకు ఫొటోలు, వీడియోలు..
ఈ క్రమంలో రమేశ్, తన మాజీ ప్రేయసి భర్త ఫోన్ నంబర్ తెలుసుకుని గతంలో తను యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పంపించాడు. వాటిని చూసిన వివాహిత భర్త ఆరునెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువతి తిరిగి స్వగ్రామం ఇందారంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
తనను పెళ్లి చేసుకోవాలని..
ఈ క్రమంలో మహేశ్ మళ్లీ యుతి వెంట పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఫోన్కు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. పెద్దల సమక్షంలో తాను అమ్మాయి జోలికి వెళ్లనని కూడా మహేశ్ చెప్పాడు. కానీ, యథావిధిగా వేధింపులు కొనసాగించాడు.
విసిగిపోయి చంపేశారు..
మహేశ్ వేధింపులు రోజు రోజుకూ పెరగడం, ఆగడాలు మితిమీరుతున్నాయి. పోలీసులు హెచ్చరించినా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా మార్పు రాకపోవడంతో అతడిని చంపేయలని ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గ్రామంలో పాలు పోసి వస్తున్న మహేశ్ను యువతి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి మాటు వేసి దాడిచేశారు. ఇంట్లోని కత్తితో గొంతుకోశారు. అనంతరం బండరాయితో యువతితోపాటు ఆమె తండ్రి బండరాయితో తలపై కొట్టి పాశవికంగా హతమార్చారు.
అడ్డుకోకుండా వీడియో తీశారు..
అందరూ చూస్తుండగానే నలుగురు మహేశ్ను దారుణంగా చంపుతున్నా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా కొంతమంది ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీంతో సాని మనిషిని గొంతుకోసి, బండరాళ్లతో కొట్టి చంపుతున్నా.. స్థానికులు మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మహేశ్ కిరాతకుడు అయి ఉంటాడని అందుకే సొంత ఊరివాళ్లు కూడా అడ్డుకోలేదని పేర్కొంటుండగా, మరికొంతమంది మానవత్వం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహేశ్ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.