Revanth Reddy latest news: తెలంగాణ రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసింది.. కానీ, కెసిఆర్ వ్యూహ చతురతను అమలు చేసి.. ఆ క్రెడిట్ మొత్తం తను కొట్టేశాడు. స్వయం ప్రకటిత తెలంగాణ బాపుగా ప్రకటించుకున్నాడు. కెసిఆర్ అసలు లక్ష్యాన్ని కాంగ్రెస్ అంచనా వేయలేకపోయింది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావలసి వచ్చింది. తెలంగాణ ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానాన్ని అప్పగించినప్పటికీ.. కెసిఆర్ రాజకీయ పునరేకికరణ వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా అయిపోయింది.
కెసిఆర్ ఏకపక్షంగా పాలిస్తూ ఉండడం.. కొన్ని ప్రజావ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. వీటికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో తెలంగాణ పగ్గాలు అందుకోగలిగింది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ఏ స్థాయిలో అయితే ఉపయోగించుకుందో.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను దూరం పెట్టింది.
సోషల్ మీడియాను దూరం పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నష్టం జరుగుతూనే ఉంది. ఉప ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికలు.. అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. గులాబీ పార్టీ మీద ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఫలితాలు వచ్చాయి. అయితే ఎల్లకాలం అవే ఫలితాలు సాధ్యం కాదు. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించుకుంటున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా బలంగా చాటిచెప్పుతున్నది. ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంటే గులాబీ పార్టీ సోషల్ మీడియా కొన్ని లక్షల రెట్లు బలంగా ఉంది. మాధ్యమాలు ఏవైనా కావచ్చు.. గులాబీ పార్టీ బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. చివరికి ప్రభుత్వం తాను చేసిన మంచి పని కూడా చెప్పుకునే స్థితిలో లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ.. రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు జమ చేసినప్పటికీ.. మహిళలకు రకరకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ.. ఇవేవీ కూడా చెప్పుకునే స్థాయిలో ప్రభుత్వం లేదు. ఒకవేళ ఇవే పథకాలను గులాబీ పార్టీ గనుక అమలు చేసి ఉంటే.. ప్రచారం ఒక స్థాయిలో ఉండేది.
సోషల్ మీడియా బలహీనంగా మారడాన్ని ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గుర్తించినట్టు కనిపిస్తోంది. పీఏసీ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా వారియర్స్ సేవలను ఉపయోగించుకోలేకపోవడం.. బలమైన సోషల్ మీడియా విభాగాలను నిర్మించుకోలేకపోవడం.. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోకుండా.. సొంత డబ్బా కు మాత్రమే ఎమ్మెల్యేలు పరిమితం కావడం పట్ల రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదని హెచ్చరించారు. సోషల్ మీడియాను ప్రాపర్ గా వాడుకోవాలని.. ప్రభుత్వ పథకాలను.. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పుడే విజయం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారు సరైన గుర్తింపు లేక బయటికి వెళ్లిపోయిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలో నుంచి సోషల్ మీడియా వారియర్స్ బయటకు వెళ్లిపోతే అంతకుమించిన దారుణం మరొకటి ఉండదని.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరించారు. అయితే సీఎం మాటలు హెచ్చరికల వరకే ఉంటాయా.. క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు ఉంటాయా.. ఒకవేళ సీఎం మాటలు హెచ్చరికల వరకే ఆగిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎవడూ బాగు చేయలేడు.
