Rayadurg Land Auction 237 Crore Per Acre: హైదరాబాద్ పని అయిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది. హైదరాబాద్ స్థాయి హైడ్రా వల్ల నాశనం అయిందని గులాబీ పార్టీ నుంచి మొదలు పెడితే కొంతమంది సో కాల్డ్ యూట్యూబర్ల వరకు విష ప్రచారం చేస్తుంటారు కదా.. వారి నెత్తి మాసిన దిక్కుమాలిన ప్రచారానికి హైదరాబాదులో కోట్లు పలుకుతున్న భూముల ధరలే చెంపపెట్టు.
గత ఏడాది హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి 177 కోట్ల పలికింది. దీంతో చాలామంది ముక్కున వేలేసుకున్నారు. గతంలో కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమి 100 కోట్లు పలికింది. అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. సరిగ్గా గత ఏడాది రాయదుర్గంలో ఎకరం 177 కోట్ల పలకడం పాత రికార్డులను చెరిపి వేసింది. కొత్త రికార్డులను నమోదు చేసింది. వాస్తవానికి ఈ స్థాయిలో భూములకు ధర పలకడం హైదరాబాద్ నగరంలో సరికొత్త ఘనతలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.
రాయదుర్గంలో ఇప్పుడు టి జి ఐ ఐ సీ వేలం వేసిన భూములలో ఎకరం ధర 237 కోట్లు పలకడం సరికొత్త రికార్డులను సృష్టించింది. రాయదుర్గంలో ఈ స్థాయిలో భూములకు ధర పలకడం వెనక ఏం జరుగుతోంది.. అక్కడ ఏమైనా లంక బిందెలు ఉన్నాయా.. గోల్డ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా.. అనే ప్రచారం కూడా జరుగుతుంది. రాయదుర్గంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉండడానికి ప్రధాన కారణం.. ఇది హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉంటుంది. మియాపూర్ మెట్రో.. ఔటర్ రింగ్ రోడ్డు.. శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఐటి.. హెల్త్ కేర్.. లైఫ్ సైన్సెస్.. ఎడ్యుకేషన్.. ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్ గా ఉంది. దీంతో పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్లే రాయదుర్గం హైదరాబాద్ నగరానికి గుండెకాయ లాగా మారింది.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కూడా రాయదుర్గం ప్రాంతంలో విపరీతంగా ఏర్పాటు అవుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఆఫీస్ స్పేస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. గ్రేడ్ ఏ ఆఫీసు స్పేస్ లో చదరపు అడుగుకు అద్దె భారీగా పలుకుతోంది. భవిష్యత్ కాలంలో హైదరాబాద్ నగరంలో గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లు భారీగా ఏర్పాటయ్యే అవకాశం కల్పిస్తోంది. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్ వంటి విభాగాలలో జీసిసి సెంటర్లు ఇక్కడ ఏర్పాటు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాయదుర్గం హాట్ కేక్ లాగా మారింది. అందువల్లే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ భారీ అంతస్తులు నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ప్రాజెక్టులు కూడా భారీగా ఏర్పాటు అవుతున్నాయి. అందువల్లే వందల కోట్లు ఖర్చుపెట్టి భూములను కరుగులు చేస్తున్నాయి.
2017లో రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాలను ప్రభుత్వం వేలం వేస్తే 42.59 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది నాలెడ్జి సిటీ ప్రాంతంలో ఎకరం ధర 177 కోట్ల పలికింది. ఈ ఏడాది ఏకంగా ఆ ధర ఏకంగా 237 కోట్లకు చేరుకోవడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఎకరానికి 60 కోట్లు అదనంగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
