TGPSC Group 1 Mains : అసలేంటి జీవో 29… గ్రూపు–1 ఉద్యోగాలపై పీటముడికి కారణమేంటి?

తెలంగాణలో గ్రూప్‌–1 గొడవ ముదురుతోంది. గ్రూప్‌–1 మెయిన్స్‌ రీ షెడ్యూల్‌చేయాలని కొందరు.. జీవో 29 రద్దు చేయాలని మరికొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 20, 2024 10:26 am

TGPSC Group 1 Mains

Follow us on

TGPSC Group 1 Mains : తెలంగాణలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్‌తో పరీక్షలు మొదలవుతాయి. ఈమేరకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం జీవో 55ను సవరిస్తూ జారీ చేసిన జీవో 29పై గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పూర్తి కావడంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమయ్యారు. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ సమయంలోనే 55 జీవోను సవరించి జీవో 29ని జారీ చేసింది. ఇన్నాళ్లు ఈ జీవోపై ఎవరూ అభ్యంతరం తెలుపలేదు. మెయిన్స్‌ పరీక్షలు సమీపించిన వేళ ఆందోళనకు దిగారు. ఏడు నెలలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. అక్టోబర్‌ 21 పరీక్షల ప్రారంభం కానున్న వేళ వారం రోజులుగా ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు సింగ్, డివిజన్‌ బెంచ్‌లను ఆశ్రయించారు అభ్యర్థులు. రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీంతో పరీక్ష వాయిదా కోరకుండా.. జీవో 29 రద్దు చేయాలని సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. జీవో 55నే కొనసాగించాలని సుప్రీంలో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణ సోమవారం జరుపుతామని తెలిపింది. అయితే సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు.

అసలేంటీ జీవో 29..
ఇదిలా ఉంటే జీవో 29 రద్దుకు గ్రూప్‌–1 అభ్యర్థులు పట్టుపట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2022లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రూప్‌–1 రిజర్వేషన్ల విషయంలో జీవో 55 జారీ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత గ్రూప్‌–1 కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సమయంలోనే 55 జీవోను సవరిస్తూ జీవో 29 జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జీవో జారీ అయింది. ఈ జీవో కారణంగా దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని అన్‌రిజర్వుడుగా పరిగణిస్తే దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మార్కులు ఎక్కువ వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 నిష్పత్రిలో మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు.

ఏడు నెలలుగా మౌనం..
ఇదిలా ఉంటే.. జీవో 29ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8 జారీ చేసింది. అప్పటి నుంచి దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ, పరీక్షల షెడ్యూల్‌ ప్రారంభానికి వారం ముందు ఆందోళన చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఆందోళనకారుల్లో నిజమైన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో పరీక్షలను నిలిపివేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

నేడు కీలక ప్రకటన..
గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళన రాజకీయరంగు పులుముకోవడం, అభ్యర్థుల ఆందోళన ఉధృతం అయిన నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై పునరాలోచనలో పడింది. మంత్రి పొన్న ప్రభాకర్‌ నివాసంలో అధికారులు, మంత్రులు చర్చలు జరుపుతున్నారు. జీవో 29 రద్దు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. చర్చల అనంతరం ఆదివారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.