Governor Kota MLCs: ప్రొసీజర్ మళ్ళీ మొదలవుతుంది.. వారిద్దరికీ ఎమ్మెల్సీలు దక్కుతాయి..

హైకోర్టు తీర్పు వరకే పరిమితమైంది. గవర్నర్ విచక్షణాధికార పరిధిలోకి ప్రవేశించలేదు. ఇదే ఇప్పుడు అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. అయితే ఇక్కడే మళ్ళీ మరొక విధానం ప్రారంభమవుతుంది.

Written By: Suresh, Updated On : March 8, 2024 12:33 pm

Governor Kota MLCs

Follow us on

Governor Kota MLCs: రేవంత్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం నచ్చడం లేదు. అందుకే ఓ సెక్షన్ మీడియా కోదండరాం, అమెర్ అలీ ఖాన్ ను రేవంత్ కావాలని బదనాం చేశాడని విమర్శలు చేస్తున్నది. రకరకాల కథనాలు వండి వారుస్తున్నది.. డిబేట్లకైతే లెక్కేలేదు. కానీ ఇక్కడే అది మర్చిపోతున్న సంగతి, విస్మరిస్తున్న విషయం ఒకటుంది. హైకోర్టు ఇలా తీర్పు ఇస్తుందని రేవంత్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ముఖ్యులకు ఓ అంచనా ఉంది. కాకపోతే దాని కంటే ముందు వారు గవర్నర్ కు గౌరవం ఇచ్చారు. “మీ ఆదేశాల ప్రకారం” అంటూ.. విన్నవించారు. అందుకే ఆమె ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలను ఆమోదిస్తుందని భావించారు.

అందువల్లే కదా..

అందువల్లే కదా కోదండరాం, జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమించాలని నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపింది. విభేదాలు లేవు గవర్నర్ కూడా ఆమోదముద్ర వేసింది.. కానీ హైకోర్టు ఇందుకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి గతంలో నిర్ణయించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ వారికి దక్కే ఫాయిదా ఏదీ ఉండకపోవచ్చు. తీర్పు వెలువరించే విషయంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. “వాళ్ల అర్హతలకు సంబంధించిన వివరాలు కావాలంటే క్యాబినెట్ నుంచి తెప్పించుకుంటాం. వారి నియామకాన్ని పున: పరిశీలిస్తాం” అని వ్యాఖ్యానించింది. నిబంధన ప్రకారం అది కచ్చితంగా జరగాలి. అందువల్లే హైకోర్టు కోదండరాం, అలీ ఖాన్ నియామకానికి సంబంధించిన జీవోను కొట్టివేసింది.

తర్వాత ఏం జరుగుతుంది?

హైకోర్టు తీర్పు వరకే పరిమితమైంది. గవర్నర్ విచక్షణాధికార పరిధిలోకి ప్రవేశించలేదు. ఇదే ఇప్పుడు అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. అయితే ఇక్కడే మళ్ళీ మరొక విధానం ప్రారంభమవుతుంది. గవర్నర్ క్యాబినెట్ నుంచి వివరాలు అడుగుతుంది. గత క్యాబినెట్ ప్రస్తుతం లేదు కాబట్టి.. కోదండరాం, అలీ ఖాన్ నియామకాన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి.. ప్రస్తుత క్యాబినెట్ ఆ వివరాలు గవర్నర్ కు అందిస్తుంది. (ఒకవేళ పాత క్యాబినెట్ ఉన్నప్పుడు ఈ తీర్పు కనుక వచ్చి ఉంటే కథ వేరే తీరుగా ఉండేది) ప్రస్తుతం గవర్నర్ కు, ప్రభుత్వానికి ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి కోదండరాం, అలీ ఖాన్ నియామకానికి ఆమోదముద్ర వేస్తుంది. వాస్తవానికి హైకోర్టు చెప్పినట్టు అభ్యర్థుల అర్హతల మీద ఏమైనా సందేహాలు ఉంటే క్యాబినెట్ అభిప్రాయాలు కచ్చితంగా తెప్పించుకోవాలి. సో ఇప్పుడు జరిగేది అదే కాబట్టి.. పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ వారు గవర్నర్ కోటాలో నియమితులై ఉంటే.. వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారి ఉండాలి. ఈ జాబితాలో రాజకీయ నాయకులపై నిషేధం వంటి నిబంధన లేదు. సాధారణంగా ఇలాంటి వాటిని అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని, సంబంధిత దస్త్రాన్ని గవర్నర్ కు పంపిస్తుంది. గవర్నర్ కూడా దానికి ఆమోదం ముద్ర వేస్తారు. కానీ కోదండరాం, అలీ ఖాన్ విషయంలో జరిగింది వేరు.

కౌశిక్ రెడ్డి విషయంలో..

గతంలో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గవర్నర్ దృష్టికి పంపింది. గవర్నర్ తిరస్కరించడంతో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆమెను రకరకాలుగా విమర్శించింది. సొంత పత్రికలో అవమానించింది. ఎంత గవర్నర్ అయినా ఆమె కూడా ఒక మనిషే కాబట్టి సహజంగా గత ప్రభుత్వంపై కోపం ఉంది. అందుకే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ను పక్కన పెట్టింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం శ్రవణ్ అర్హుడే. కానీ గత ప్రభుత్వం తనను పెట్టిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించింది.

జోక్యం చేసుకోలేదు

హైకోర్టు తీర్పు వెలువరించినప్పటికీ గవర్నర్ విచక్షణాధికారాల పరిధిలోకి ప్రవేశించలేదు. ఆ అధికారాలకు సంబంధించి జోక్యం చేసుకోలేదు. ఒకవేళ అది జరిగి ఉంటే గవర్నర్ తనకున్న అధికారాల మీద కోర్టును స్పష్టత అడిగేది. అప్పుడు ఆ కేసు మరింత తీవ్రమయ్యేది. ఇప్పుడిక గవర్నర్ కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని ఆపలేరు. ఈ విషయాన్ని మోడీ, అమిత్ షాకు చెప్పకుండా ఉండలేరు. సో మొత్తానికి కోదండరాం, అలీ ఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అవుతున్నారు. ఎమ్మెల్సీలయిన మరుసటి క్షణమే కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారట.. రేవంత్ రెడ్డి మదిలో కూడా అదే ఆలోచన ఉందట. కెసిఆర్ కు మరొక కౌంటర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడన్నమాట.. వారెవా భలేగా ఉంది పో తెలంగాణ రాజకీయం.