TG Paddy Procurement: వడ్లు అమ్మిన 48 గంటల్లో రైతులకు డబ్బులు.. బోనస్‌తో కలిసి ఖాతాల్లో జమ!

తెలంగాణలో వానాకాలం పంటలు చేతికి వస్తున్నాయి. వానాకాలం పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Written By: Raj Shekar, Updated On : October 4, 2024 3:26 pm

TG Paddy Procurement

Follow us on

TG Paddy Procurement: తెలంగాణలో వానాకాలం సీజన్‌ ముగిసింది. అక్టోబర్‌ 1 నుంచి రబీ సీజన్‌ ప్రారంభమైంది. దీంతో వానాకాలం సాగుచేసిన వివిధ పంటలు చేతికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరో నెల రోజుల్లో వరికోతలు ఊపందుకునే అవకాశం ఉంది. దీపావళి నుంచి పత్తి దిగబడి కూడా వస్తుంది. మొక్కజొన్న, సోయా పంటలు ఇప్పటికే చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు పంట దిగుబడి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్లతో స్వయంగా సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి అన్ని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. యాసంగిలో వడ్లు అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులజ ఇచ్చామని ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. ఈ ఖరీఫ్‌ నుంచే సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సన్నరకం, దొడురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

తొలిసారిగా సన్నవడ్లకు బోనస్‌..
రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్‌ ఇవ్వడం ఇదే మొదటిసారని సీఎం తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. గన్నీ సంచులు అందు, కాంటాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన సంచులపై కేంద్రం క ఓడ్‌ వేసి మిల్లులకు పంపించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు. తేమ, తరుగు పేరుతో రైతులను మోసం చేయొద్దని సూచించారు. రైతుల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును పరిష్కరించాలన్నారు. పౌరసరఫరాల విభాగంలో 24 గంటలు పనిచేసేలా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం చేరే వరకు నిబంధనలు పాటించాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలు ఇలా..
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 4,496 కేంద్రాలు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో, 2,102 కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో541 ఇతర కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 480 కేంద్రాలు, జగిత్యాల జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక సిద్దిపేటలో417, మెదక్‌లో 387, నల్గొండలో 375, కామారెడ్డిలో 351 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అతి తక్కువగా ఆదిలాబాద్‌ జిల్లాలో కేవలం 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యం శుభ్రంగా, నాణ్యతతో, తేమ శాతం 17కు మించకుండా ఉండాలి.