CM Revanth Reddy: తెలంగాణలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యక్తి ఆధారంగానే ప్రజలు కూడా ఓటు వేస్తారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ ఆధారంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అంగన్వాడీ, ఆశ వర్కర్లు పోటీ చేశారు. గ్రామస్తులకు వారు అందించిన సేవలకు గుర్తుగా కొన్ని చోట్ల వార్డు సభ్యులుగా, సర్పంచులుగా కౌన్సిలర్లుగా విజయం సాధించారు. కొందరు ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో పోటీకి వాళ్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తి చెప్పింది. సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం గ్రామస్థాయి నుంచి మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది.
ఉద్యోగ జీవితం ముగిసిపోకుండా..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేస్తే, గెలిచినా ఓడినా వారి ఉద్యోగ జీవితం ముగిసిపోతుంది. కానీ అంగన్వాడీ సిబ్బందికి మాత్రం ఈ నియమంలో మినహాయింపు ఇచ్చి, వారు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కల్పించడం సానుకూలమైన చర్య. అంగన్వాడీ కార్మికులు గ్రామాల్లో శిశు పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు అందిస్తారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. వారు స్థానిక సమస్యలను బాగా అర్థం చేసుకుంటారు. అందుకే చాలా మంది గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారు. కానీ ఉద్యోగం కోల్పోతామనే భయంతో వెనుకడుగు వేస్తుండేవారు.
సీఎం సానుకూల నిర్ణయం..
గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేసిన అంగన్వాడీ సిబ్బంది, ఆ స్థానాలు ఖాళీగా ఉంటే తిరిగి నియమించబడతారు. వారు దరఖాస్తు చేసుకుంటే వారి అర్జీలను పరిశీలించి, వారితోనే ఆ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది వారి జీవనోపాధిని కాపాడుతూ, స్థానిక రాజకీయాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది.
ఈ నిర్ణయం ఉద్దేశం..
అంగన్వాడీ కార్మికులు గ్రామ స్థాయిలో మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకుంటారు. వారు సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికైతే స్థానిక పరిపాలన మరింత సమర్థవంతంగా ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరుత్సాహపడతారు. ఈ నిర్ణయం ఆ అడ్డంకిని తొలగించి, ఎక్కువ మందిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సహాయపడుతుంది.అంగన్వాడీ ఉద్యోగం చాలా మంది కుటుంబాలకు ఏకైక ఆదాయ వనరు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మళ్లీ ఉద్యోగంలో చేరగలగడం వారి కుటుంబాలను ఆర్థికంగా భద్రపరుస్తుంది. అనుభవజ్ఞులైన అంగన్వాడీ కార్మికులు స్థానిక సంస్థల్లోకి వస్తే, పిల్లల పోషణ, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు జరుగుతాయి.
రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ముందడుగు. అంగన్వాడీ కార్మికులు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది వారి జీవనోపాధిని కాపాడుతూ, గ్రామాల అభివృద్ధికి కొత్త శక్తిని ఇస్తుంది. ఇలాంటి నిర్ణయాలు మరిన్ని రాష్ట్రాలు అనుసరిస్తే, గ్రామస్థాయి నాయకత్వం మరింత బలపడి, ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి.
