Bathukamma Sarees : తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తోందంటే చాలు.. నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. ప్రతీ ఇంటా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. నెల ముందు నుంచే షాపింగులు, ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. ఎక్కడెక్కడో ఉన్నవారంతా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊర్లకు పయనం అవుతుంటారు. కుటుంబసభ్యులంతా ఒక దగ్గరకు చేరుకొని పండుగ ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే.. తెలంగాణలో మరో పదిహేను రోజుల్లోనే పండుగ రాబోతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహిళలు సర్కార్పై ఫైర్ అవుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటి నుంచి గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసేది. రేషన్ షాపులు, రేషన్ కార్డుల ఆధారంగా చీరలు అందించేవారు. సిరిసిల్ల నేతన్నలకు ఏటా చేతినిండా పనికల్పించి.. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా కేసీఆర్ సర్కార్ చీరలు అందిస్తుండేది. అవి చాలా మంది పేద మహిళలకు ఉపయోగపడుతుండేవి. వాడితోనే పండుగను చేసుకునే వాళ్లు.
అయితే.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. బతుకమ్మ చీరలకు ఆయన మంగళం పాడినట్లుగానే అర్థం అవుతోంది. బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవడిందని, భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ చాలా సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తున్నప్పటికీ చీరల జోలికి పోలేదు. దాంతో ఒకింత మహిళల్లో అసహనం వ్యక్తం అవుతోంది. బతుకమ్మ చీరలకు బదులు డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఏటా రెండు పర్యాయాలు మహిళలకు చీరలు అందిస్తామని ఆ మధ్య ప్రకటించారు. అయితే.. పండుగకు ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తే వాటిని ఏం చేసుకుంటామనే అభిప్రాయం మహిళల నుంచి వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉండగా.. తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో చీరలు పంపిణీ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయకుంటే వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. అటు మహిళల నుంచి, ఇటు ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని అలర్ట్ చేశారట. దాంతో ఆ నెగెటివిటి నుంచి బయటపడేందుకు మరో కొత్త ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఆ రెండు చీరలు ఇచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు రేషన్ షాపుల ద్వారా ఎలా అయితే బతుకమ్మ చీరలు పంపిణీ చేశారో.. ఈ ఏడాది పండుగకు ఒక్కో మహిళకు రూ.500 నగదు పంపిణీ చేసేందుకు రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అయితే.. దీనిపైనా దీర్ఘాలోచన చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అటు డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇవ్వడమా.. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఇవ్వడమా అనే అనుమానంతో ఉన్నారని సమాచారం. అయితే.. ఆ 500లు కూడా అకౌంట్లో వేయకుండా.. నేరుగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తేనే మైలేజ్ వస్తుందని, అందుకే రేషన్ షాపుల ద్వారా ఇచ్చేందుకే రెడీ అయ్యారట.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More