HomeతెలంగాణFarmers Urea Problems: రేవంత్ సార్ జర చూడండి.. రైతుల యూరియా కష్టాలు ఎలా ఉన్నాయో?

Farmers Urea Problems: రేవంత్ సార్ జర చూడండి.. రైతుల యూరియా కష్టాలు ఎలా ఉన్నాయో?

Farmers Urea Problems: తెల్లవారుజామున 3 గంటలకే వచ్చారు. అప్పటినుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉదయం 10 దాటిన తర్వాత ఆగ్రోస్ కేంద్రం యజమాని వచ్చాడు. అప్పటికే భారీగా వచ్చిన రైతులను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ టోకెన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే అతడు టోకెన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడో.. ఒక్కసారిగా రైతులు గుమి గూడారు. తట్టుకోలేక అతడు టోకెన్లు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఇలానే పరిస్థితి ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఈ ఏడాది పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు విస్తారంగా వరి నాట్లు వేశారు. వరి పంట ఏపుగా పెరగాలంటే కచ్చితంగా యూరియా అవసరముంటుంది. పైగా వరిసాకు పెరగడంతో యూరియా డిమాండ్ పెరిగింది. దీనికి తోడు సప్లై లేకపోవడంతో ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం పెరిగింది. దీంతో యూరియా కోసం వారు బారులు తీరడం మొదలుపెట్టారు. కొన్నిచోట్ల అయితే కొట్టుకుంటున్నారు కూడా. ప్రభుత్వం యూరియా కోసం అనేక రకాలుగా కేంద్రంతో సంప్రదింపులు జరిపినప్పటికీ రైతుల అవసరాలకు తగ్గట్టుగా రావడం లేదు. దీంతో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల అయితే రాత్రి మొత్తం అక్కడే జాగారం చేస్తున్నారు. ఓవైపు అదును దాటిపోతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు.

డిమాండ్ అధికం
వరిసాకు పెరగడంతో యూరియాకు డిమాండ్ అధికమైంది. డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలు మొదట్లో ముఖం చాటేసాయి. ఆ తర్వాత విస్తారంగా కురవడంతో వరి నార్లు పోసుకున్న రైతులు.. నాట్లు వేశారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వరి పంట పిలక దశలో ఉంది. ఈ దశలో ఉన్న వరి పంటకు యూరియా అనేది అత్యవసరం. అందువల్లే రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి కేంద్రం సకాలంలో యూరియాను సప్లై చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. మరోవైపు యూరియా తయారీకి కావాల్సిన ముడి కొరత ఉన్న నేపథ్యంలో ఇబ్బంది ఎదురవుతోందని కేంద్రం చెబుతోంది. సమస్యలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా రైతులు పడుతున్న ఇబ్బందులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటికైనా రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సప్లై చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular