CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌ ఇచ్చింది.. కాంగ్రెస్‌ షాకిచ్చింది.. జర్నలిస్ట్‌లకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన రేవంత్‌ సర్కార్‌

జర్నలిస్టు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు వారధి. ప్రజా సమస్యలను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే కలం యోధుడు. ఇలాంటి జర్నలిస్టును ఆదుకునేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి.

Written By: NARESH, Updated On : October 8, 2024 8:50 am

CM Revanth Reddy(14)

Follow us on

CM Revanth Reddy: జర్నలిస్టులు నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ.. పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఇలా వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం ప్రభుత్వాలు కూడా తోచినసాయం చేస్తున్నాయి. నిరుపేదలుగా భావించి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నాయి. తెలంగాణ వచ్చాక జర్నలిస్టులందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని, జర్నలిస్టు కాలనీలు నిర్మిస్తామని పదేళ్ల క్రితం సీఎం హోదాలో కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, పదేళ్ల తర్వాత కూడా ఆ హామీకి మోక్షం కలుగలేదు. ఈతరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లా/నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే స్వేచ్ఛను కేసీఆర్‌ కల్పించారు. దీంతో హడావుడిగా ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. ఒక్క ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు మాత్రమే అధికారికంగా జీవో జారీ చేశారు. ఇతవరకు బాగానే ఉన్నా.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. జర్నలిస్టుల పేరు చెప్పుకుని అక్రమాలకు తెరతీశారు. జర్నలిస్టులు కాని, వారికి, తమ పర్సనల్‌ సెక్రెటరీలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న జర్నలిస్టుల భార్యల పేరిట పట్టాలు జారీ చేశారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలం పక్కనే ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.

కరీంనగర్‌లో అనర్హులే ఎక్కువ..
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కూడా జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే, జర్నలిస్టులు ఎవరో, కానివారు ఎవరో నిర్ధారించాల్సింది కలెక్టర్‌. జిల్లాలో అర్హుల జాబితాను కొందరు యూనియన్‌ నేతల ఇంట్లో. మంత్రి ఇంట్లో కొందరు నేతలు కూర్చుండి తయారు చేశారు. ఈ జాబితాలో అర్హులకు బదులు మంత్రి ఇంట్లో పనిచేసే వర్కర్ల పేర్లు, యూనియన్‌ నేతల కుటుంబ సభ్యుల పేర్లు చేర్చారు. మంత్రి సామాజిక వర్గానికి చెందిన స్థానికంగా ఉండని జర్నలిస్టుల పేర్లు కూడా జాబితాలో చేర్చారు. అర్హత లేని జర్నలిస్టుల పేర్లు కూడా జాబితాలో చేర్నారు. పదేళ్లకుపైగా జరనలిస్టుగా పనిచేసే అర్హులు ఉన్నా.. తమకు అనుకూలంగా లేరన్న కారణంగా వారి పేర్లు తొలగించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జర్నలిస్టుల భార్యల పేర్లు చేర్చారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా జాబితా తయారు చేశారు. మొత్తంగా 118 మంది అర్హులు అని గుర్తించి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజు పట్టాల పేరిట పత్రాలు ఇచ్చారు.

ఓటమితో బ్రేక్‌..
ఇక ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో అన్యాయం జరిగిన జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అనర్హులకు, అనుయాకులకు గంగుల కమలాకర్‌ మంత్రి హోదాలు జర్నలిస్టుల పేరిట పట్టాలు ఇచ్చుకున్న విషయంపై ఫిర్యాదు చేశారు. పెద్ద పత్రికల జర్నలిస్టులకు రహస్య జాబితాలో స్థలాలు కేటాయించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దీనిపై విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అప్పటి వరకు ఎవరికీ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు జన్నలిస్టులు పేదరికం కోటాలో తీసుకున్న ప్లాట్లను అమ్ముకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కథ అడ్డం తిరిగింది.

రహస్య జాబితాలో ఒక్కొక్కరికి మూడు ప్లాట్లు..
ఇక అధికారికంగా 118 మందికి ప్లాట్లు ఇచ్చినట్లు ఉత్తర్వులు విడుదల చేయించిన నాటి మంత్రి గంగుల కమలాకర్‌.. రహస్యంగా మరో 32 మందికి స్థలం కేటాయించారు. ఇందులో పెద్ద పత్రికల బ్యూరో ఇన్‌చార్జిలు, స్టాఫర్లు, స్థానికంగా ఉండని జిల్లాకు చెందిన జర్నలిస్టులు, గంగుల కమలాకర్‌ సామాజికవర్గానికి చెందిన జర్నలిస్టులు ఉన్నారు. వీరంతా గతంలోనే ప్లాట్లు తీసుకున్నారు. కానీ మంత్రికి సన్నిహితంగా ఉండడంతో ఆయన కూడా రహస్యంగా మరో జాబితా సిద్ధం చేయించి ఒక్కొక్కరికి కనీసం మూడు ప్లాట్లు కేటాయించారు. అయితే వీరు ఎన్నికలు ముగిసే నాటికే తమకు వచ్చిన ప్లాట్లను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విక్రయించుకున్నారు.

కొనుగోలుదారుల ఒత్తిడి..
పాట్లు కొనుగోలు చేసినవారు ఆరు నెలలైనా ఎన్‌వోసీ రాకపోవడంతో అమ్మిన జర్నలిస్టులపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీంతో ఓ ప్రధాన పత్రిక బ్యూరో ఇన్‌చార్జి ఉద్యమం పేరిట ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు మొదలు పెట్టారు. పాట్లు అమ్మిన జర్నలిస్టులను పోగుచేసి అనుమతులు ఇవ్వాలని, ఎన్‌వోసీ ఇవ్వాలని వినతిపత్రాలు ఇవ్వడం ప్రారంభించాడు. కానీ, అర్హత ఉండి ప్లాట్లు రాని జర్నలిస్టులు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అలర్ట్‌ అయ్యారు. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్‌ పమేలా సత్పతి గతంలో కేటాయించిన పట్టాలు రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అర్హత ఉండి ఇళ్ల స్థలాలు పొందలేకపోయిన జర్నలిస్టులు స్వాగతిస్తున్నారు. ఇక అమ్ముకుని సొమ్ము చేసుకున్న జర్నలిస్టుల్లో ఆందోళన మొదలైంది.